పవన్ కల్యాణ్ దీక్ష: జనసేన నేతల పోరుబాట: రైతుల కోసం: భారత్ బంద్కు ఒక్కరోజు ముందే
అమరావతి: ముందుగా హెచ్చరించినట్టే.. జనసేన పార్టీ పోరుబాటు పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలను చేపట్టింది. అన్ని స్థాయిల్లోని జనసేన పార్టీ నాయకులు ఈ దీక్షలను చేపట్టారు. దీక్షా శిబిరాల్లో కూర్చున్నారు. ముఖ్యమంత్రి వైఎష్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వానికి నిరసనగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. బ్యానర్లను కట్టారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన నివాసంలో ఈ దీక్షను ప్రారంభించారు. ఒంటరిగా దీక్షకు కూర్చున్నారు.
సంబంధం లేకపోయినా- జనసేన పార్టీ మిత్రపక్షం బీజేపీ పార్లమెంట్లో తీర్మానం చేసిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా దేశవ్యాప్తంగా రైతులు నిర్వహించ తలపెట్టిన భారత్ బంద్కు ఒక్కరోజు ముందే.. అదే రైతాంగ సమస్యల కోసం ఉద్యమించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ ఉదయం సరిగ్గా 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసన దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం వరకూ కొనసాగుతుంది.

నివర్ తుఫాన్ వల్ల సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో పంటను నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారాన్ని ప్రకటించాలనేది పవన్ కల్యాణ్ డిమాండ్. నివర్ తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో ఆయన స్వయంగా పర్యటించారు. పంటను నష్టపోయిన రైతులను పరామర్శించారు. వారి సాధక బాధకాలను అడిగి తెలుసుకున్నారు. నష్ట పరిహారాన్ని చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ ఈ సందర్భంగా పలువురు రైతులు పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.

దీనితో- రైతులకు సకాలంలో పంట నష్టాన్ని చెల్లించేలా తక్షణ చర్యలను తీసుకోవాలంటూ పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు. హెక్టారుకు 35 వేల రూపాయలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. తక్షణ సాయం కింద 10 వేల రూపాయలను మంజూరు చేయాలని
అన్నారు. దీనికోసం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఆయన రెండు రోజుల గడువు ఇచ్చారు. ఈ 48 గంటల్లోగా రైతులకు పంట నష్టం మొత్తాన్ని విడుదల చేయాలని, లేకపోతే- తాము నిరసన దీక్షలను చేపడతామని హెచ్చరించారు.

ఈ డిమాండ్కు ప్రభుత్వం స్పందించలేదు. దీనితో ముందే హెచ్చరించినట్టే- పవన్ కల్యాణ్ దీక్షలను చేపట్టారు. పవన్ కల్యాణ్ తన నివాసంలో దీక్షను ప్రారంభించారు. పార్టీ నాయకులు, జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు జిల్లాల్లో ఈ దీక్షలను చేపట్టారు. రైతుల పక్షపాతిగా చెప్పుకొంటోన్న ప్రభుత్వం వాస్తవ పరిస్థితులకు భిన్నంగా వ్యవహరిస్తోందని జనసేన నేతలు మండిపడ్డారు. సకాలంలో తుఫాన్ పరిహారాన్ని అందించకపోతే.. ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications