ఎయిర్పోర్ట్ అథారిటీని ఆకాశానికెత్తేసిన పవన్ కల్యాణ్: యాక్టర్, ఫిలాంథ్రోపిస్ట్, పొలిటీషియన్గా
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకుని రావడం ఓ సవాల్గా మారింది. విమాన ప్రయాణికులెవరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండటానికి ఎయిర్పోర్ట్ అథారిటీ కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంది. రోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల్లో భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజేషన్ వంటి చర్యలను సమర్థవంతంగా చేపడుతోంది. ఒక్క ప్రయాణికుడు కూడా కరోనా బారిన పడకుండా సమర్థవంతమైన చర్యలను అమలు చేస్తోంది.
Recommended Video

పవన్ కల్యాణ్ను ఆకట్టుకున్న ఏఏఐ చర్యలు
లాక్డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలోనూ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు నిరంతరాయంగా శ్రమించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వందేభారత్ మిషన్ కింద దశలవారీగా విమానాలను నడిపించారు. వేలాదిమందిని ఇళ్లకు చేర్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు చేపట్టిన చర్యలు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ను ఆకట్టుకున్నాయి. అందుకే- ఎలాంటి భేషజాలకు పోకుండా ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులను ఆయన ప్రశంసించారు. ఆకాశానికెత్తేశారు.
కరోనా కట్టడి చర్యలు అద్భుతం..
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు తీసుకున్న చర్యలు అద్భతుంగా ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. సంక్షోభ సమయంలో..ముందు జాగ్రత్తగా వ్యవహరించిన తీరు తనను కట్టిపడేసిందని చెప్పారు. తాను రాజస్థాన్ ఉదయ్పూర్లోని మహారాణా ప్రతాప్ విమానాశ్రయాన్ని సందర్శించానని, కరోనాను నియంత్రించడానికి అక్కడి అధికారులు తీసుకున్న చర్యలు బాగున్నాయని మెచ్చుకున్నారు. కోవిడ్ మార్గదర్శకాలు, ప్రొటోకాల్స్ను అనుసరించడంలో రాజీపడలేదని చెప్పారు.

స్ఫూర్తినిచ్చేలా
ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ అధికారుల పనితీరును ఇతరుల్లో స్ఫూర్తినింపేలా ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మరొకరు అనుసరించేలా ఉన్నాయని అభినందించారు. మాస్కులను ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించేలా చేయడం వంటి కోవిడ్ ప్రొటోకాల్స్ను అనుసరించడంలో అధికారులు విమానా ప్రయాణికుల్లో అవగాహన, చైతన్యాన్ని కల్పించారని పేర్కొన్నారు. దీన్ని ఇలాగే కొనసాగించాలని ఆయన అకాంక్షించారు.

వీడియోను పోస్ట్ చేసిన ఏఏఐ
దీనికి సంబంధించిన ఓ వీడియోను ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు తమ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ తమను ప్రశంసించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. యాక్టర్, స్క్రీన్ రైటర్, స్టంట్ కోఆర్డినేటర్, ఫిలాంథ్రోపిస్ట్ అండ్ పొలిటీషియన్గా ఆయనను అభివర్ణించారు. అలాంటి వ్యక్తి తమ పనితీరును ప్రశంసించడం సంతోషాన్ని ఇస్తోందని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు విమానాశ్రయ ఉద్యోగులు, సిబ్బందిని మరింత ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు.

నిహారిక పెళ్లి కోసం..
పవన్ కల్యాణ్ ఇటీవలే రాజస్థాన్లోని ఉదయ్పూర్కు వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన సోదరుడు, నటుడు నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి హాజరు కావడానికి పవన్ కల్యాణ్ స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉదయ్పూర్కు వెళ్లారు. మెగా ఫ్యామిలీ కుటుంబం మొత్తం ఆ వివాహానికి హాజరైంది. వారంతా ఉదయ్పూర్ విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు మెగా కుటుంబ సభ్యులను స్వాగతించిన తీరు పవన్ కల్యాణ్ను ఆకర్షించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చేపట్టిన చర్యలు పవన్ కల్యాణ్ను ప్రశంసించేలా చేశాయి.












Click it and Unblock the Notifications