కొత్త ఏడాదిలో పవన్ కల్యాణ్ భారీ స్కెచ్ ఇదే: జనసేన ఇక ఫుల్ యాక్టివ్: జగన్ సర్కార్పై వార్
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. కొత్త ఏడాది సందర్భంగా సరికొత్త నిర్ణయాలను తీసుకోబోతోన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దండయాత్ర సాగించనున్నారు. దీనికోసం ఆయన విస్తృతంగా జిల్లాల పర్యటనకు పూనుకుంటున్నారు. కొత్త ఏడాది ఆరంభం నుంచే ఆయన జిల్లాలు, నియోజకవర్గాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తోంది. ఏడాది పొడవునా ప్రజల మధ్య ఉండేలా షెడ్యూల్ను రూపొందిస్తున్నారని అంటున్నారు.

రైతాంగ సమస్యలే ప్రధానాస్త్రాలుగా..
పవన్ కల్యాణ్ ఇప్పటికే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. నివర్ తుఫాన్ ప్రభావానికి గురైన జిల్లాల్లో ఆయన విస్తృత పర్యటలను నిర్వహించారు. కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పర్యటించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 35 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించాలని, తక్షణ సాయంగా 10 వేల రూపాయలను అందించాలంటూ ఆయన ప్రభుత్వానికి డిమాండ్ పెట్టారు నివర్ తుఫాన్ వల్ల 17 లక్షల 30 వేల ఎకరాల్లో పంట నీట మునిగిందని, సుమారు తొమ్మిది లక్షల మంది రైతులు నష్టపోయారంటూ ఆయన నినదించారు.

వాటికి కొనసాగింపుగా..
ఆయా జిల్లాల పర్యటనకు కొనసాగింపుగా పవన్ కల్యాణ్.. ఈ సారి నియోజకవర్గాల సందర్శనకు వెళ్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా ఆయన టూర్ షెడ్యూల్ను పార్టీ నేతలు రూపొందిస్తున్నారు. దాదాపు ఇది తుదిదశకు వచ్చినట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా వచ్చేనెల మూడో వారం నుంచి నియోజకవర్గాల పర్యటన ఉంటుందని సమాచారం. సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత పవన్ కల్యాణ్ నియోజకవర్గాల్లో పర్యటించేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. తొలుత ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ పర్యటన ఉంటుందని సమాచారం.

ప్రతి నెలా నాలుగు చోట్ల..
ప్రతి నెలా కనీసం నాలుగు అసెంబ్లీ నియోవర్గాల్లో పర్యటించేలా పవన్ కల్యాణ్ షెడ్యూల్ను రూపొందించినట్లు సమాచారం. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో దీనికి సంబంధించిన రూట్ మ్యాప్పై కసరత్తు చేస్తున్నారని, త్వరలోనే దీన్ని ఖరారు చేస్తారని చెబుతున్నారు. పర్యటన వివరాలు, అజెండా మొత్తం రైతులు, స్థానిక సమస్యలు, నియోజకవర్గ స్థాయిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వైఖరి వంటి అంశాల ఆధారంగా ఉంటుందని అంటున్నారు. ప్రధానంగా రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా ఉంటుందని తెలుస్తోంది.

28న ప్రకాశం జిల్లాకు పవన్
నివర్ తుఫాన్లో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ జనసేన పార్టీ ఈ నెల 28వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, బైఠాయింపులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలను అందజేసి, నిరసన తెలిపే కార్యక్రమాలను రూపొందించిందా పార్టీ.
ఇందులో పవన్ కల్యాణ్ పాల్గొనబోతోన్నారు. ఆయన ప్రకాశం జిల్లాలో జనసేన నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారని అంటున్నారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బైఠాయించడంతో పాటు కలెక్టర్కు ఆయన స్వయంగా వినతిపత్రం ఇస్తారని సమాచారం. ఆయన ఎక్కడ పాల్గొంటారనే విషయాన్ని జనసేన పార్టీ నాయకులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ.. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రకాశం జిల్లాలో పాల్గొనే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications