గొప్ప బడ్జెట్ ఇచ్చిన మోదీ, నిర్మలకు థ్యాంక్స్.. జగన్ వల్లే ఏపీకి నిధులు నిల్: పవన్ కల్యాణ్
ఆర్థికమాంద్యం ప్రభావాన్నిలెక్కచేయకుండా 2.83 లక్షల కోట్ల కేటాయింపులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా గొప్పదని, అన్నివర్గాలకూ మేలు చేసేలా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అయితే ఏపీకి ప్రత్యేకంగా నిధులు దక్కకపోవడానికి సీఎం జగనే కారణమని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ పై పవన్ స్పందన ఆయన మాటల్లోనే..
ఆర్థిక ప్రగతికి పునాది
‘‘ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్నవేళ.. ఇండియాపైనా దాని ప్రభావం ఉన్నప్పటికీ.. అలాంటి గడ్డుపరిస్థితుల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం గొప్ప ఆకాంక్షలతో కూడుకున్నది. చాలా బలమైన ఆర్థిక ప్రగతిని సాధించేదిగా ఉంది. సామాజిక శ్రేయస్సు కోసం.. ఏ వర్గాలైతే నిర్లక్ష్యానికి గురయ్యాయో వాటికి అండగా ఉండే బడ్జెట్ ఇది.
కొలువుల పండుగ
ముఖ్యంగా రైతాంగానికి రూ.15లక్షల కోట్ల రుణం కల్పించాలన్న ఆశయం, 2.83లక్షల కోట్ల నిధుల కేటాయింపు, 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా తీసుకున్న స్ఫూర్తి దాయక నిర్ణయం.. నిరాశలో కొట్టుమిట్టాడుతోన్న రైతులకు కొండంత అండగా నిలుస్తుంది. అలాగే, ఉత్పత్తి, నిర్మాణ రంగానికి కేటాయించిన నిధులు కూడా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు బోలెడన్ని అవకాశాలు కల్పిస్తాయి.
మోదీకి థ్యాంక్స్
ఆదాయపన్నుకు సంబంధించి ఏడు శ్లాబుల పాలసీ విధానం ఆయా ఆదాయ వర్గాలకు చాలా ఊరట కలిగిస్తుంది. బడ్జెట్ మొత్తంగా ప్రధాని నరేంద్ర ఆకాంక్షిస్తోన్న నవభారతానికి బలమైన పునాదులు వేసేదిగా ఉంది. అలాంటి బడ్జెట్ ఇచ్చినందుకు, దేశాన్ని పురోగతిలో నడిపిస్తున్నందుకు ప్రధాని మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు జనసేన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
వైసీపీదే తప్పు
రాష్ట్రాన్ని నడిపిస్తోన్న వైసీపీ ప్రభుత్వం.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో చాలా ఘోరంగా విఫలమైంది. వీళ్లు కూల్చివేతలు, రద్దులు, రాజధాని తరలింపులు, ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడంపై పెట్టిన ఫోకస్.. బడ్జెట్ పై పెట్టుంటే.. కేంద్రం నుంచి కచ్చితంగా గొప్ప నిధులు వచ్చేవి. కానీ ఇది పూర్తిగా వైసీపీ వైఫల్యమే. కనీసం ఇప్పటికైనా వాళ్లు కళ్లు తెరుచుకోవాలని కోరుకుంటున్నాను'' అని పవన్ కల్యాణ్ అన్నారు.