త్వరలో పవన్ కళ్యాణ్ ప్రజాయాత్ర, రెండు రాష్ట్రాల్లో జనంబాట
అమరావతి: జనసేన పార్టీ బరిలోకి దిగే ముందు ఆషామాషీగా కాకుండా ప్రజా నాడిపై పూర్తి అవగాహన ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యణ్ భావిస్తున్నారట. అందుకే త్వరలో జనసేన అధినేత కూడా ప్రజాయాత్ర మొదలు పెట్టనున్నారట.

ప్రజాయాత్ర ఖాయం
పవన్ నేరుగా జనంలోకి వెళ్లి వాళ్ల సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటారట. ఆ పార్టీ ముఖ్య నేతలు తెలిపిన విశ్వసనీయ సమాచారం ప్రకారం పవన్ ప్రజాయాత్ర ఖాయమని తెలిసింది. పైగా పవన్ కేవలం ఒక్క ఎపికే పరిమితం కాకుండా రెండు రాష్ట్రాల్లోనూ ప్రజాయాత్ర నిర్వహిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రజాయాత్ర చెయ్యాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ ఎప్పటి నుంచి ఈ యాత్ర చేపట్టాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.

లండన్ నుంచి వచ్చాక ప్రజాయాత్ర నిర్ణయం
లండన్ నుంచి తిరిగి వచ్చిన తరువాత పవన్ తమ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన సందర్భంగా ఈ ప్రజాయాత్ర విషయమై నిర్ణయం తీసుకున్నారట. ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన రావాలంటే ప్రజాయాత్ర చేపట్టక తప్పదని పవన్ భావిస్తున్నారట. అయితే ఈ సందర్భంగా తాను రెండు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటించాలని భావిస్తున్నట్లు పవన్ చెప్పారట. అయితే ఈ ప్రజాయాత్ర అనేది పాదయాత్రా లేక బస్సుయాత్రా అనే విషయంపై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.

పాదయాత్ర లేక బస్సుయాత్రా
అయితే పాదయాత్ర విషయమై సందర్భం ఎదురైనప్పుడు పవన్ తన ఆరోగ్య బలహీనత గురించి చెప్పడం పైగా ప్రజల సమస్యలు తెలియాలంటే పాదయాత్రే చెయ్యాల్సిన అవసరం లేదనడం బట్టి ఆయన పాదయాత్ర కంటే బస్సు యాత్ర వంటిదే చేపట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ప్రజానాడిపై అవగాహనతో
తమ పార్టీ బరిలోకి దిగే ముందు ఆషామాషీగా కాకుండా ప్రజా నాడిపై పూర్తి అవగాహనతో ఉండాలని పవన్ భావనగా తెలుస్తోంది. అందుకే ప్రజాయాత్ర అనంతరం పార్టీ ప్లీనరీ కూడా నిర్వహించాలని పవన్ నిర్ణయించుకున్నట్లు ఆయన మాటలను బట్టి అర్ధం అయిందట. పవన్ సూచనలకు ముఖ్య నేతలందరూ ఏకాభిప్రాయం తెలిపారట. ఇకనుంచి పవన్ పార్టీపై మరింత దృష్టి సారించి వచ్చేఆరు నెలల్లో పార్టీని బాగా బలోపేతం చెయ్యడం, పార్టీ సభ్యత్వాన్నిఉధృత్వం చెయ్యడం వంటివి చేపడతారట.












Click it and Unblock the Notifications