వంగవీటి రాధతో నాదెండ్ల మనోహర్ భేటీ: తండ్రి జయంతి నాడే ముహూర్తం ఫిక్స్?
విజయవాడ: రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పొత్తుల వ్యవహారం నడుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళ్తారంటూ ప్రచారం కొనసాగుతున్న వేళ.. ప్రతిపక్ష పార్టీలు ఏకీకృతం కావడంపై దృష్టి సారించినట్టే కనిపిస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకట్లా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందంటూ ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు పలు సందర్భాల్లో తేల్చి చెప్పారు.
పొత్తుల వ్యవహారం..
ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ.. తన పొత్తు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. వైఎస్ఆర్సీపీనీ ఓడించడానికి రాజకీయ పార్టీలన్నీ తమతో కలిసి రావాలంటూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదివరకే బహిరంగంగా పిలుపునిచ్చారు. ప్రధానంగా- జనసేన పార్టీని కలుపుకొని.. ఎన్నికలను ఎదుర్కొనవచ్చనే ప్రచారం రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగుతోంది. భారతీయ జనతా పార్టీ-జనసేన మధ్య పొత్తు ఉన్నప్పటికీ- అది ఎన్నికల వరకు ఉంటుందా? లేదా అనేది అనుమానమే.
వంగవీటి రాధాతో
ఈ పరిణామాల మధ్య జనసేన మరో ముందడుగు వేసింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు వంగవీటి రాధాతో సంప్రదింపులు నిర్వహించింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూతగా ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహన్ స్వయంగా రాధా కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని ఇద్దరు నాయకులు స్పష్టం చేస్తోన్నప్పటికీ.. నిప్పు లేనిదే పొగ రాదన్నట్టుగా- రాజకీయ కోణం ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది.
రాజకీయ పరిణామాలపై చర్చ..
విజయవాడ ఎన్బీవీకే భవన్లో ఈ ఆదివారం జనసేన.. పార్టీ తరఫున జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్లారు. అనంతరం అదే ప్రాంతంలో గల వంగవీటి రాధా కార్యాలయానికి వెళ్లారు. ఆయనతో సమావేశం అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. టీడీపీ-జనసేన పొత్తు అంశం సైతం వారిద్దరి మధ్య చర్చకు వచ్చిందని చెబుతున్నారు.
టీడీపీలో క్రియాశీలకంగా లేని రాధా..
ఇదివరకు వైఎస్ఆర్సీపీలో ఉన్న వంగవీటి రాధా ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. తెలుగుదేశంలో చేరారు. ప్రారంభంలో పార్టీ కార్యకలాపాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ మధ్య కాస్త దూరంగా ఉంటూ వస్తోన్నారు. ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడులోనూ పెద్దగా కనిపించలేదాయన. టీడీపీలో క్రియాశీలకంగా ఉండట్లేదని, దీనికి కారణం- పార్టీ ఫిరాయించాలనే ఆలోచనలో చేయడమేనని తెలుస్తోంది.
4న ముహూర్తం పెట్టారా?
ఈ నెల 4వ తేదీన వంగవీటి మోహన రంగా జయంతి. ఈ సందర్భంగా ఆయన జనసేన పార్టీలో చేరొచ్చని సమాచారం. విజయవాడ బందర్ రోడ్లోని రంగా విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించడానికి స్వయానా పవన్ కల్యాణ్ రానున్నారని, అదే కార్యక్రమంలో వంగవీటి రాధ జనసేనలో చేరుతారని అంటున్నారు. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకొంటారని చెబుతున్నారు. ఈ అనుమానాలు, ప్రచారానికి మరింత బలాన్ని కలిగించేలా నాదెండ్ల మనోహర్.. వంగవీటితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.