ఉన్నట్టుండి ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ - హైదరాబాద్ వెళ్లిన వెంటనే..!!
అమరావతి: విశాఖపట్నం: మొన్నటికి మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. వాటి విలువ 10,500 కోట్ల రూపాయలు. కొన్నింటిని ఆయన ప్రారంభించారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రా యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. లక్షలాది మందిని ఉద్దేశించి ప్రసంగించారు.

మోదీతో భేటీ తరువాత..
అదే సమయంలో- ప్రధానితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. మోదీ- ఐఎన్ఎస్ చోళలో అడుగు పెట్టిన వెంటనే పవన్ కల్యాణ్ను కలుసుకున్నారు. భారతీయ జనత పార్టీ రాష్ట్రశాఖ కోర్ కమిటీ నాయకులతో భేటీకి ముందే పవన్తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ వద్ద ప్రస్తావనకు అంశాల గురించి క్లుప్తంగా ప్రస్తావించారు.

హైదరాబాద్కు..
అనంతరం విశాఖలోనే ఉన్న పవన్ కల్యాణ్.. విజయనగరం జిల్లాలో పర్యటించారు. గుంకలాంలో జగనన్న కాలనీలను పరిశీలించారు. జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు పేరుతో పార్టీ తరఫున చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. దీని తరువాత ఆయన మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారు.

మోదీపై కామెంట్స్..
ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో వాటిని పోస్ట్ చేశారు. గుంటూరు శేషేంద్ర శర్మ కవితలను పవన్ కల్యాణ్ తన పోస్టుల్లో ఉటంకించారు. ఎంత ఎత్తుకు ఎదుగుతాడో మనిషి ఈ కఠిన ధరిత్రి మీద.. అంత దీర్ఘంగా పడుతుంది చరిత్రలో అతని నీడ'- అంటూ శేషేంద్ర చెప్పిన ఈ కవితా పంక్తులు ప్రధాని మోదీ ప్రస్థానానికి అద్దం పడతాయని స్పష్టం చేశారు.

క్లిష్ట సమయంలో ప్రధానిగా..
దేశంలో అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో దేశ ప్రధానమంత్రిగా మోదీ పగ్గాలను స్వీకరించారని గుర్తు చేశారు. ప్రాంతీయ వాదాలు, సాంస్కృతిక వైరుధ్యాలు.. అన్నింటినీ అర్థం చేసుకొన్నారని పేర్కొన్నారు. వాటన్నింటినీ సమానంగా ఆదరించి దేశ పౌరుల్లో ప్రతి ఒక్కరిలోనూ తాము భారతీయులం అనే భావన నింపారని పవన్ కల్యాణ్ తాజాగా వ్యాఖ్యానించారు.

అహరహం తపించారు..
కరోనా వైరస్ రూపంలో ప్రజారోగ్యానికి విపత్తు వాటిల్లినప్పుడు, దేశ భద్రతకు ముప్పు పొంచి ఉన్నప్పుడు వాటి నుంచి దేశాన్ని, దేశ ప్రజలను బయట పడవేయడానికి ప్రధాని మోదీ అహరహం తపించారని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రతి కఠిన పరిస్థితినీ ఉక్కు సంకల్పంతో ఆయన ఎదుర్కొన్నారని కితాబిచ్చారు. అలాంటి స్వభావం, నాయకత్వ పటిమ గల పురోగమనశీలిగా మోదీని పవన్ కల్యాణ్ అభివర్ణించారు.












Click it and Unblock the Notifications