యాక్షన్ టైమ్: మా పార్టీ గుర్తుపై గెలిచి, వైసీపీకి మద్దతా? రాపాకపై చర్యలను తప్పుపట్టిన జనసేన..!
అమరావతి: అసెంబ్లీలో జనసేన పార్టీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఏకైక సభ్యుడు రాపాక వరప్రసాద్పై క్రమశిక్షణాచర్యలకు జనసేన పార్టీ సిద్ధమౌతోంది. తొలుత- ఆయనకు షోకాజ్ నోటీసులను పంపించాలని, ఆయన ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే పార్టీ నిబంధనలకు అనుగుణంగా చర్యలకు దిగాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మూడు రాజధానులకు అనుకూలంగా..
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఏపీ వికేంద్రీకరణ, ప్రాంతాల సమాన అభివృద్ధి చట్టం-2020, అమరావతి మెట్రో అభివృద్ధి చట్టం-2020లకు అనుకూలంగా రాపాక వరప్రసాద్ ఓటు వేశారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పొగడ్తల వర్షాన్ని కురిపించారు. రాపాక వరప్రసాద్ చర్యలను జనసేన పార్టీ అగ్ర నాయకత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

రాపాక చర్యలు గర్హనీయం అంటూ..
అసెంబ్లీలో రాపాక వరప్రసాద్ ప్రవర్తించిన తీరు, తీసుకున్న నిర్ణయాలు గర్హమైనవని అంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన చర్యలను పార్టీ ఖండిస్తోందని అన్నారు. రాపాక చర్యలను పార్టీ సమర్థించట్లేదని స్పష్టం చేశారు. అవన్నీ పార్టీ సిద్దాంతాలు, విధానాలకు సంబంధం లేనివని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలను ధిక్కరించి రాపాక.. బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారని అన్నారు.

పీఏసీలో చర్చ.
రాపాక వరప్రసాద్ అంశాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అసెంబ్లీకి ఎన్నికైనప్పటి నుంచీ ఆయన పార్టీ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తూనే ఉన్నారని, ఇలాగే చూస్తూ ఉండిపోతే పార్టీ నాయకులు, కార్యకర్తల్లో చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన పీఏసీ సమావేశమైంది.

చర్యలు తప్పవనే సంకేతం..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని, అమలు చేస్తోన్న ప్రతి సంక్షేమ పథకాన్ని రాపాక వరప్రసాద్ సమర్థిస్తూ వస్తున్నారని కమిటీ సభ్యులు నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లుకు కూడా మద్దతు పలికారని, అనుకూలంగా ఓటు వేశారని అన్నారు. ఆయన చర్యలన్నీ పార్టీ నిబంధనలను వ్యతిరేకంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. రాపాకపై క్రమశిక్షణాపరమైన చర్యలను తీసుకోవాల్సిందేనంటూ పట్టుబట్టారు.

పార్టీ ఆదేశించినప్పటికీ..
నిజానికి- అసెంబ్లీలో అధికార పార్టీ ప్రవేశ పెట్టబోయే ఏపీ వికేంద్రీకరణ, ప్రాంతాల సమాన అభివృద్ధి చట్టం-2020, అమరావతి మెట్రో అభివృద్ధి చట్టం-2020లకు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్..రాపాక వరప్రసాద్ను ఆదేశించారు. ఈ మేరకు పార్టీపరంగా విప్ను కూడా జారీ చేశారు. అయినప్పటికీ.. వాటిని ఖాతరు చేయలేదు రాపాక. సమావేశాలు కొనసాగుతున్నంత సేపూ ఆయన ముఖ్యమంత్రితో సన్నిహితంగా మెలుగుతూ కనిపించారు. బిల్లును సమర్థిస్తూ ప్రసంగించారు. చివరికి.. ఓటు కూడా అనుకూలంగా వేశారు.

అది వైసీపీ విధానం..
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనేది జనసేన పార్టీ విధానం కాదని.. పవన్ కల్యాణ్ సైతం స్పష్టం చేశారు. అది వైఎస్ఆర్సీపీ విధానమని, దానికి అనుకూలంగా తమ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓటు వేయడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. జనసేన గుర్తుపై గెలిచిన ఆయన వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో.. రాపాక వరప్రసాద్కు నోటీసులను జారీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications