పవన్ కల్యాణ్ సంచలనం: స్టార్ ఇమేజ్ను పక్కన పెట్టి.. చాతుర్మాస్య దీక్ష: 4 నెలల పాటు వాటికి దూరం
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ స్టార్ హీరో గానీ, ఏ పొలిటికల్ లీడర్ గానీ చేపట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే నిర్ణయం అది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాజ సంక్షేమాన్ని, లక్షలాది మంది చిరు వ్యాపారుల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని అకాంక్షిస్తూ ఆయన ఓ దీక్షకు పూనుకున్నారు. అదే- చాతుర్మాస్య దీక్ష. పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు.

నాలుగు నెలల పాటు
బుధవారం తొలి ఏకాదశి. శయనై ఏకాదశిగా పిలుస్తారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్షను చేపట్టారు. నాలుగు నెలల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు దీక్షను ప్రారంభించి ఆయన కార్తీక శుక్ల ఏకాదశి నాడు విరమిస్తారు. దీక్షను విరమించే సమయంలో హోమాన్ని నిర్వహించబోతున్నారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజ మాసాల్లో దీక్ష కొనసాగుతంది. కార్తీక శుక్ల ఏకాదశి నాడు దీన్ని విరమిస్తారు.

ఒంటిపూట.. సాత్వికాహారం..
చాతుర్మాస్య దీక్షలో ఉన్ననంత కాలం పవన్ కల్యాణ్ మాంసాహారానికి దూరంగా ఉంటారు. మితంగా ఆహారాన్ని తీసుకుంటారు. సాత్వికాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారు. అది కూడా ఒక్కపూట మాత్రమే. సూర్యాస్తమయం అనంతరం కొద్దిగా పాలు, పండ్ల ఆహారంగా తీసుకుంటారు. రాత్రి శాకాహారం భోజనంతో ఆ రోజుకు దీక్షను ముగిస్తారు. ఇలా కార్తీక శుక్ల ఏకాదశి వరకూ కొనసాగిస్తారు. దీక్ష విరమణ రోజున హోమాన్ని నిర్వహించి.. పూర్ణాహూతితో దీక్షను విరమిస్తారు. అదే రోజు భారీ ఎత్తున చండీ హోమాన్ని నిర్వహించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.

కరోనా సంక్షభం నుంచి బయటపడేలా..
కరోనా సంక్షోభం నుంచి యావత్ దేశం బయట పడటానికే పవన్ కల్యాణ్ చాతుర్మాస్య దీక్షను స్వీకరించారని జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పీ హరి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ పట్టి పీడిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఆర్థికంగా, మానసికంగా అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. కులవృత్తులను నమ్ముకుని జీవిస్తోన్న స్వర్ణ కారులు, నేత కార్మికులు, కళాకారులు, చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారని పవన్ కల్యాణ్ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Recommended Video

దేశ సంక్షేమం కోసం
ఈ దుర్భర పరిస్థితుల నుంచి దేశాన్ని, ప్రజలు వీలైనంత త్వరగా బయటపడాలని, వారంతా సాధారణ జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటూ పవన్ కల్యాణ్ ఈ దీక్షకు పూనుకున్నట్లు హరిప్రసాద్ చెప్పారు. దేశ ప్రజల క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆర్థిక శ్రేయస్సును కాంక్షిస్తూ తమ పార్టీ అధినేత చేపట్టిన ఈ చాతుర్మాస్య దీక్ష విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇదివరకు కూడా పలుమార్లు పవన్ కల్యాణ్ ఈ దీక్షను పూనుకున్నారని, ఈ సారి ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని చేపట్టారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications