పాకిస్థాన్ షాక్ తో భారత్ కు వేల కోట్ల నష్టం.. ఏడాదికి రూ. 4 వేల కోట్లు పైనే..!
భారత విమానాలపై పాకిస్థాన్ గగనతలం నిషేధాన్ని మరోసారి పొడిగించింది. జూలై 24 వరకు పొడిగిస్తూ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఏడాదిగా పాకిస్థాన్ గగనతలం మూసివేసిన నేపథ్యంలో భారత్ కు వేల కోట్ల నష్టం వాటిల్లుతోంది. భారత్ లోని ఎయిర్ ఇండియా తదితర విమానయాన సంస్థలకు ఏటా రూ. 4 వేల కోట్లకుపైనే నష్టం వాటిల్లుతున్నట్లు స్పష్టం అవుతోంది. విమాన ప్రయాణ సమయం కూడా 60 నిమిషాల నుంచి దాదాపు 3 గంటలకు పెరిగినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ నిర్ణయం.. భారత్ వైమానిక రంగంపైనే ప్రభావం చూపుతోందని సమాచారం.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, పాకిస్థాన్ తన వైమానిక మార్గాల మూసివేతను నిరంతరం పొడిగిస్తుండటం భారతీయ విమానయాన రంగంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. అంతర్జాతీయ మార్గాల ఎంపిక, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ దేశీయ విమానయాన దిగ్గజాలకు సవాలుగా మారింది. ముఖ్యంగా ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి అగ్రశ్రేణి సంస్థలు తమ ప్రయాణ రూట్లను మార్చుకోవడమే కాకుండా, పలు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసుకోవాల్సి వస్తోంది.
భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇండిగో సంస్థ తాష్కెంట్, అల్మట్టి, హోచిమిన్ సిటీ, హాంకాంగ్, షాంఘై వంటి పలు అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. మరోవైపు, ఎయిర్ ఇండియా సైతం చికాగో, షాంఘై, మాలే మార్గాల్లో విమానాలను రద్దు చేసుకుంది. గతంలో నడిపిన నాన్-స్టాప్ అమెరికా విమానాలను వియన్నా, కోల్కతా లేదా సియోల్ మీదుగా ఒక స్టాప్ తో నడపాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణ సమయంతో పాటు ల్యాండింగ్, టేకాఫ్ ల రూపంలో ఫ్లైట్ సైకిల్స్ రెట్టింపై విమానాల నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతోంది.
సర్వీసుల రద్దు, అంతర్జాతీయ రూట్ల మార్పు ప్రభావం దేశీయ విమాన సంస్థల అంతర్జాతీయ మార్కెట్ వాటాపై స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో దేశీయ ఎయిర్లైన్స్ వాటా 46.3 శాతంగా ఉండగా, ప్రస్తుత సంక్షోభం కారణంగా అది 42.3 శాతానికి పడిపోయింది. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ విదేశీ విమానయాన సంస్థలు రవాణా మార్కెట్లో మళ్లీ పట్టు సాధించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి.
భారతదేశంలో విమాన ఇంధన ధరలు (ఏటీఎఫ్) ఎయిర్లైన్స్ మొత్తం నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 35 నుండి 40 శాతం వరకు ఆక్రమిస్తాయి. ఇంధన ఖర్చుల భారం పెరగడంతో సర్వీసుల నిర్వహణ ఆర్థికంగా క్లిష్టంగా మారుతోంది. గత 19 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఒక్క అంతర్జాతీయ రూట్ను కూడా రద్దు చేయని రికార్డు ఉన్న ఇండిగో, ప్రస్తుత పరిస్థితుల వల్ల పలు సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. ఎయిర్ ఇండియా సైతం ప్రైవేటీకరణ తర్వాత అమెరికా సర్వీసుల పరంగా అత్యంత కఠినమైన దశను ఎదుర్కొంటోంది.

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో విమానయాన సంస్థలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇంధన స్థిరీకరణ నిధిని ప్రవేశపెట్టినప్పటికీ, దాని లబ్ధిపై ఇంకా స్పష్టత లేదు. దేశీయ విమానయాన రంగంలో సుమారు 90 శాతం మార్కెట్ వాటాను నియంత్రిస్తున్న ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు ప్రస్తుతం తమ సామర్థ్యాన్ని తగ్గించుకుని ఆచితూచి ముందడుగు వేస్తున్నాయి. అంతర్జాతీయ మార్గాల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటేనే భారత విమానయాన రంగానికి తగిన ఊరట లభిస్తుంది.












Click it and Unblock the Notifications