ఈ సారి ఎవ్వరు చెప్పినా వినే ప్రసక్తే లేదు: భారత్కు పాకిస్తాన్ ప్రధాని హెచ్చరికలు
భారత్పై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధు జలాల ఒప్పందం అంశంపై భారత్కు హెచ్చరికలు జారీ చేశారు. తమకు చెందాల్సిన ప్రతి నీటి బొట్టునూ దక్కించుకుంటామని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండే ప్రసక్తే లేదని, ఎవ్వరు చెప్పినా వినబోమనీ స్పష్టం చేశారు. తన వైఖరిని మార్చుకోకపోతే నేరుగా తగిన సమాధానం ఇస్తామని అన్నారు.
పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని యాద్గార్-ఎ-ఫతాలో మాట్లాడారు. భారత్ తో జరిగిన యుద్ధం అనంతరం అంతర్జాతీయంగా పాకిస్తాన్ ప్రతిష్ఠ మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఎవరైనా పొరపాటున కూడా పాక్ భూభాగంపై దాడికి ప్రయత్నిస్తే.. గత ఏడాది కంటే అత్యంత తీవ్రస్థాయిలో తిప్పికొడతామని, తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే సహించబోమని అన్నారు.

భారత్ తన ఏకపక్ష చర్యల ద్వారా ఈ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగిస్తోందని షెహబాజ్ షరీఫ్ విమర్శించారు. పాకిస్తాన్కు దక్కే ప్రతీ నీటి బొట్టు తమకు అత్యంత కీలకమైనదని, దీన్ని రెడ్ లైన్ గా భావిస్తామని అన్నారు. ఈ చారిత్రాత్మక నీటి వివాదం విషయంలో వెనుకంజ వేయబోమని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంశంపైనా మాట్లాడారు షరీఫ్. తన పాత వైఖరినే పునరుద్ఘాటించారు. కాశ్మీరీలకు అంతర్జాతీయ వేదికలపై తాము అందిస్తున్న రాజకీయ, దౌత్య, నైతిక మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆకాంక్షలు నెరవేరే వరకు వారి ప్రాణత్యాగాలను వృథా కానివ్వబోమని అన్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతిభద్రతల అంశాన్నీ ప్రస్తావించారు. తమ దేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, దీన్ని తమ బలహీనతగా తీసుకోవద్దని అన్నారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలకు లోబడి, న్యాయమైన పద్ధతిలో అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడానికి పాకిస్తాన్ చురుకైన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలను నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ వేడుకలలో భాగంగా ఇటీవల సౌదీ అరేబియా, టర్కీ దేశాలతో కుదుర్చుకున్న త్రైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని షరీఫ్ అధికారికంగా ప్రకటించారు. ఈ కీలక ఒప్పందం ప్రకారం మూడు దేశాలలో దేనిపై దాడి జరిగినా అది తమ కూటమిపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని, సంయుక్తంగా తిప్పికొడతామని స్పష్టం చేశారు. ఈ నయా రక్షణ వ్యూహం ద్వారా పాకిస్తాన్ మరింత శక్తిమంతంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.
గత ఏడాది జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో పాక్ సరిహద్దుల నుంచి వచ్చిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి తర్వాత భారత్ అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించేందుకు భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరిట భారీ ఎత్తున సైనిక చర్యలకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.














Click it and Unblock the Notifications