ఢిల్లీకి చేరిన రాజకీయం.. హస్తినలో పవన్ కల్యాణ్
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో జనసేనాని పవన్ కల్యాణ్ హస్తినాపురం వెళ్లారు. దేశ రాజధానిలో భారతీయ జనతాపార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఇరువురు నేతలమధ్య రాష్ట్రంలో నెలకొన్న, జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే పొత్తులు అవసరంలేదనే కీలక సూచన చేసినట్లు సమాచారం.

బీజేపీని ఉత్కంఠకు గురిచేసిన పరిణామాలు
వాస్తవానికి పవన్ తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అవసరమైతే పొత్తులకు కూడా తాను సిద్ధమేనని ప్రకటించారు. కొంతకాలం నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రజాప్రతినిధుల వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీని ఓడిస్తానని, బుద్ధిచెబుతానని హెచ్చరించారు. విజయవాడలో చంద్రబాబు నేరుగా పవన్ ను కలిసి సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జరిగిన పరిణామాలన్నీ బీజేపీని తీవ్ర ఉత్కంఠకు గురిచేశాయి.

ఇరుపార్టీల మధ్య సఖ్యత లేమి?
తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి ఎటువంటి కార్యక్రమం నిర్వహించలేదు. ఎవరికి వారుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. అయితే చంద్రబాబు, పవన్ కలయికతో అప్రమత్తమైన బీజేపీ అధిష్టానానికి వార్తలు చేరవేయడంతో పవన్ కల్యాణ్ తో బుజ్జగింపుల పర్వానికి తెరలేపారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలే ఢిల్లీ వెళ్లివచ్చారు.
తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా కలిశారని సోము బీజేపీ పెద్దలకు తెలిపినట్లు సమాచారం. అయితే తాను రోడ్ మ్యాప్ అడిగినప్పటికీ ఇవ్వకుండా తాత్సారం చేస్తుండటంతో తన వ్యూహం మార్చుకుంటున్నానని పవన్ ప్రకటించారు. అయినంత మాత్రాన తాను బీజేపీకీకికానీ, మోడీకికానీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

6 నెలల ముందు నిర్ణయం తీసుకోవచ్చులే..!
ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, ఆరునెలల ముందు ఏ నిర్ణయమైన తీసుకోవచ్చని, అలా కాకుండా ఇప్పుడే టీడీపీతో చేతులు కలిపితే ప్రజల్లో చులకనవుతామని, అప్పుడు నిర్ణయం తీసుకుంటే మేలని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీరు టీడీపీతో జనసేన కలవాలా? వద్దా? అన్న విషయాన్ని, జనసేనతో కలిసి ప్రయాణం చేసే విషయంలో కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
మరోవైపు ఈనెల 30వ తేదీన పార్టీ నాయకులతో రెండురోజులపాటు పవన్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో భవిష్యత్తు కార్యక్రమాలతోపాటు పార్టీ విధివిధానాలపై వారికి దిశానిర్దేశం చేయాలని భావించారు. అయితే కేంద్రంలోని పెద్దలు కొన్ని సూచనలు చేయడంతో పవన్ కల్యాణ్ కూడా సందిగ్ధంలో పడ్డారు. ఏం జరుగుతుదో చూడాలి మరి.!












Click it and Unblock the Notifications