కౌలు రైతు కుటుంబాలకు పవన్ భరోసా-సత్యసాయిజిల్లాలో పరామర్శలు, సాయం
ఏపీ రాజకీయాల్లో జనసేనాని మరోసారి యాక్టివ్ అవుతున్నారు. మండు వేసవిలో సత్యసాయి జిల్లాలో కౌలు రైతుల భరోసాయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కొత్త చెరువులో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ పరామర్శించారు.
సత్యసాయి జిల్లాలో కౌలు రైతుల బలవన్మరణాలపై స్పందించిన జనసేనాని ఇవాళ వారి కుటుంబాలను పరామర్శించి సాయం చేసేందుకు వీలుగా పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని ఆయన భార్య సాకే సుజాతకు అందజేశారు. పార్టీ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు.
అనంతరం ధర్మవరంలో కౌలు రైతు అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రం శివనగర్ ప్రాంతానికి చెందిన కౌలు రైతు అన్నపురెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డారు. జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ధర్మవరంలో రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి మరణానికిగల కారణాలు అడిగి తెలుసుకున్నారు.
జనసేన పార్టీ తరఫున ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో ఆయన భార్య చంద్రకళకు అందజేశారు. రాజశేఖర్ రెడ్డికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వారిని చదివించే బాధ్యతను కూడా జనసేన పార్టీ తీసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.