పవన కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఫిక్స్..!?
పవన్ కల్యాణ్ వారాహి తో రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్రకు ముహూర్తం ఖరారైంది. మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వస్తున్నారు. తన వారాహితో రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తానని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. దసరా నుంచే ఈ పర్యటన జరగాల్సి ఉన్నా..వాయిదా పడింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం పవన్ సమాయత్తం కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా సభ్యత్వాలు.. నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించేలా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే టీడీపీ యువ నేత లోకేష్ పాదయాత్ర ఏపీలో కొనసాగుతోంది .ఇక..ఇప్పుడు పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వస్తుండటంతో ఇక..రాజకీయంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

ఎన్నికల వేళ పవన్ కార్యాచరణ సిద్దం..
ఏపీలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అధికార వైసీపీ..ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేస్తున్నాయి. ఈ సమయంలో జనసేనాని కొత్త కార్యాచరణతో ప్రజల్లోకి రావాలని డిసైడ్ అయ్యారు. రెండు నెలల క్రితమే పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభించాలని భావించారు. అయితే అంచనా వేసినట్లుగా ముందస్తు ఎన్నికలకు అవకాశం లేకపోవటంతో పర్యటన మరి కొంత కాలం తరువాత చేయాలని డిసైడ్ అయ్యారు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం ఆ రోజుకు. పార్టీ సభ్యత్వాలు..స్థానిక నాయకత్వం లో చేయాల్సిన మార్పులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన పార్టీ సభ్యత్వం పైన పవన్ కీలక ప్రకటన చేయనున్నారు. అదే విధంగా ఈ సారి పార్టీ ఆవిర్భావ సభ తిరుపతి లేదా విశాఖలో నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సభ నుంచే పవన్ రానున్న ఎన్నికలకు సమరశంఖం పూరించేందుకు నిర్ణయించారని సమాచారం.

మేనిఫెస్టో..అభ్యర్ధుల ఎంపిక
టీడీపీతో పొత్త ఖాయమని భావిస్తున్న వేళ..పవన్ కల్యాణ్ ఆచి తూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. బీజేపీతో పొత్తు కొనసాగుతున్న వేళ పవన్ టీడీపీతో పొత్తు సంకేతాలు ఇవ్వటంతో ఏం జరబోతోందునే ఉత్కంఠ కొనసాగుతోంది. తాజాగా పవన్ తాము ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతూనే మూడు ఆప్షన్లను వెల్లడించారు. ఈ సమయంలో ఎన్నికల వేళ పొత్తులు..సీట్లు గురించి నిర్ణయం తీసుకోవాలనేది పవన్ వ్యూహంగా సమాచారం. దీంతో..ముందుగా నియోజకవర్గాల వారీగా సమీక్షలకు సిద్దం అవుతున్నారు. సీట్ల కేటాయింపులో తమ మాట చెల్లుబాటు అయ్యేలా మిత్రపక్షాల పైన ఒత్తిడి పెరగాలంటే అభ్యర్ధుల ను ఖరారు చేయటం అవసరమని జనసేన భావిస్తోంది. ఇదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ ఆవిర్భావ సభలోనే ప్రకటించేందుకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. మార్చిలోనే నియోజకవర్గాల సమీక్షలు పూర్తి చేయనున్నారు.
వారాహితో ఎన్నికల యుద్దంలోకి పవన్
ఇప్పటికే సిద్దమైన వారాహితో ఏప్రిల్ లో పవన్ పర్యటన ప్రారంభం కానుంది. ఏపీతో పాటుగా తెలంగాణలోనూ పవన్ పర్యటన కొనసాగనుంది. ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదినం నాడు పవన్ తన వారాహి యాత్ర ప్రారంభిస్తారని సమాచారం. తిరుపతి నుంచే యాత్ర ప్రారంభం అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర సీమ జిల్లాల్లో కొనసాగుతోంది. ఏప్రిల్ లో సీమ నుంచి కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో.. పవన్ పార్టీ నేతలు చెబుతున్నట్లుగా తిరుపతి నుంచి యాత్ర ప్రారంభిస్తారా..లేక ఉత్తరాంధ్ర ను ఎంచుకుంటారా అనే చర్చ కూడా కొనసాగుతోంది. యాత్రకు సంబంధించి షెడ్యూల్...రూట్ మ్యాప్ పైన ప్రస్తుతం పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ మొత్తానికి సంబంధించి పవన్ అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications