వాలంటీర్లపై పవన్ సంచలన కామెంట్స్ - ముందే చెప్పా, వారే వాళ్ల టార్గెట్..!!
వాలంటీర్ల పై జనసేనాని పవన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. విశాఖపట్నంలో ఇటీవల వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వరలక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్ కి.. వాలంటీర్లకు తేడా లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని విమర్శించారు. విశాఖ ఎంపీ కిడ్నాప్ వ్యవహారం పైన స్పందించారు.
వరలక్ష్మి కుటుంబానికి పరామర్శ : విశాఖలో వారాహి యాత్ర చేస్తున్న పవన్ కల్యాణ్ మరసారి వాలంటీర్లపైన సంచలన కామెంట్స్ చేసారు. సుజాత నగర్ లో వాలంటీర్ చేతితో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. ఈ నెల 3న వాలంటీర చేతిలో వరలక్ష్మి హత్యకు గురయ్యారు. ఆ వాలంటీర్ ను అప్పటికి వారం ముందే విధుల నుంచి తప్పించినట్లు జీవీఎంసీ కమిషనర్ అప్పట్లో వెల్లడించారు.

వరలక్ష్మి కుటుంబ సభ్యులకు పవన్ ధైర్యం చెప్పారు. హత్య జరిగిన తీరు పైన ఆవేదన వ్యక్తం చేసారు. వృద్ధురాలిని వలంటీర్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడని.. పిడి గుద్దులు గుద్ది.. కేవలం బంగారు నగల కోసం కిరాతకంగా వ్యవహారించాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రభుత్వం తరఫున ఒక్క వైసీపీ నాయకుడు కూడా పరామర్శించలేదని అన్నారు.
ప్రభుత్వ ప్రైవేటు సైన్యం : పాస్ పోర్టు కావాలంటే వెరిఫికేషన్ ఉండాలి కానీ, వాలంటీర్ల నియామకానికి అవసరం లేదని ధ్వజమెత్తారు. నవరత్నాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యంగా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు. ఇళ్లల్లో చొరబడి వాలంటీర్లు గొంతులు కోస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు.
వాలంటీర్లు ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారని తాను గతంలో చెప్పానని గుర్తు చేసారు. రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ జరుగుతోందన్నారు. కొంతమంది వాలంటీర్ల నుంచి పిల్లలు, పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. చాలా చోట్ల వాలంటీర్లు ఆకృత్యాలకు పాల్పడుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.

ఎంపీ పైన ఘాటు వ్యాఖ్యలు : తమపై ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం తప్పు చేసిన వారిని మాత్రం వదిలేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎంపీ ఇంట్లో జరిగిన కిడ్నాప్ వ్యవహారాన్ని పవన్ ప్రస్తావించారు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన రౌడీ షీటర్లతోనే ఎంపీ మిలాఖత్ అయ్యారని పవన్ ఆరోపించారు. ఎంపీ ఇంట్లో అఘాయిత్యానికి పాల్పడిన వారిని చూసి భయపడతారేంటని ప్రశ్నించారు.
తాజా ఘటనలను కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. గతంలో మహిళల మిస్సింగ్ పై చెప్పిన గణాంకాలు తాను చెప్పినవి కావన్నారు. పరిశోధన సంస్థలు చెప్పిన గణాంకాలే తాను ప్రస్తావించానని స్పష్టత ఇచ్చారు. తన పైన ఆంక్షలు పెడుతున్నారని..కానీ, నేరగాళ్లకు ఎలాంటి ఆంక్షలు లేవని ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications