ఇదేంటి!!... ఇలా చేశారు?
అసెంబ్లీలో నెలకొన్న పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరగడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు లేకుండా ఈ దాడులేంటని వైసీపీని ఉద్దేశించి పవన్ ప్రశ్నించారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీ శాసనసభకు సంబంధించి మీడియా ద్వారా అందిన సమాచారాన్ని విశ్లేషించిన తర్వాత జరిగిన పరిణామాలు దురదృష్టకరమైవన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా, ప్రజల గొంతు నొక్కేందుకు ఉద్దేశించిన జీవో నెంబరు 1పై చర్చను ప్రతిపక్ష టీడీపీ శాసనసభ్యులు కోరారని, వారిపై అధికార పక్షం దాడులు చేయడం గర్హనీయమన్నారు.

ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ముక్తకంఠంతో ఖండించాలన్నారు. అర్థవంతమైన చర్చలు జరగాల్సిన చట్ట సభల్లో ప్రజలకు మేలు చేస్తారని అందరూ ఆశిస్తారని, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్చ జరగాలని ఆశిస్తారనన్నారు.
అర్థవంతమైన చర్చలు లేకుండా దాడులేమిటి? - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/zmgGMwWO60
— JanaSena Party (@JanaSenaParty) March 20, 2023
చర్చ కోసం పట్టుబడితే దాడిచేయడం భావ్యం కాదని, ఇదే పరిస్థితి కొనసాగితే దాడులు చట్టసభల్లోనుంచి వీధుల్లోకి వస్తాయన్నారు. ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తాయని, ముందుగా చట్టసభల గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత సభానాయకుడిగా ముఖ్యమంత్రితోపాటు సభ ప్రిసైడింగ్ అఫీషియల్స్ మీద కూడా ఉందని పవన్ ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
ఏపీ అసెంబ్లీలో తమపై దాడిజరిగినట్లు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు డోలా బాలవీరాంజనేయస్వామి, బుచ్చయ్యచౌదరి ఆరోపించారు. శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. తర్వాత వారంతా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేయగా దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

ఆ తర్వాత వైసీపీకి చెందిన చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.












Click it and Unblock the Notifications