ఈ నెల 20న జగన్ అడ్డాలో పవన్ కళ్యాణ్ టూర్- ఆంక్షలపై సర్వత్రా ఉత్కంఠ
ఏపీలో ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గేరు మారుస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రల్ని అన్ని జిల్లాల్లో పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సీఎం జగన్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించబోతున్నారు.
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 20వ తేదీ శనివారం ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. సాగు నష్టాలు, అప్పుల బాధలతో కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి పవన్.. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారని పార్టీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అనంతరం రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో జనసేనాని పాల్గొంటారు.
Recommended Video
రాజంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసే రచ్చబండలో పవన్ కళ్యాణ్.. రైతు కుటుంబాల ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో పూర్తయ్యింది. అలాగే ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో తొలి విడత పూర్తయింది.
మరోవైపు ప్రస్తుతం కడప జిల్లాలో నెలకొన్న పరిస్ధితుల్లో సీఎం జగన్ పర్యటనకే పోలీసులు గట్టి భద్రత కల్పించాల్సి వస్తోంది. జగన్ బాబాయ్ వివేకా హత్య తర్వాత జిల్లాలో మారిన పరిస్దితుల్లో పోలీసుల గస్తీ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు పోలీసులు సహకరిస్తారా, ఆంక్షలు విధిస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే పశ్చిమగోదావరి సహా పలు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ టూర్లకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో కడప జిల్లాలో ఏం జరగబోతోందన్నది ఆసక్తి కరంగా మారింది.