నాయకులారా జాగ్రత్త! 'పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కదా.. ఆలోచించడనుకుంటే పొరపాటు'
నెల్లూరు: కుటుంబ రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల వెంట ఉండే వారిని తాను రాజకీయాల్లోకి తీసుకు వస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన నెల్లూరు జిల్లా పర్యటనలో అన్నారు. పార్టీ నిర్మాణం ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారని, తాను తలుచుకుంటే జిల్లాకొకటి, నియోజకవర్గానికి ఒక కమిటీ వేయగలనని, కానీ వాళ్లు వ్యక్తిగతంగా తప్పులు చేస్తే నాపై పడతాయన్నారు. అందుకే ఆచితూచి ముందుకు సాగుతున్నానని చెప్పారు.
వైసీపీకి ఇన్ని సీట్లంటున్నారు కానీ, జగన్ సీఎం కావొద్దు, తొక్కేస్తాం: బీజేపీకి పవన్ కళ్యాణ్ హెచ్చరిక
2009లో నెల్లూరు నుంచి పోటీ చేసేవాడిని
సమాజానికి ఏదైనా చెయ్యాలనే ఆలోచన తనకు తొలుత నెల్లూరులోనే కలిగిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కుటుంబ పాలనకు స్వస్తీ చెబుతూ కొత్త తరం రాజకీయాల్లోకి రావాలన్నారు. నెల్లూరు తాను పెరిగిన ఊరు, ఇక్కడ తాను పవర్ స్టార్ని కాదని, సాధారణ పవన్ కళ్యాణ్ను అని చెప్పారు. జనసేన సిద్ధాంతాలలో ఒకటైన కులాల ఐక్యతకు మూలం నెల్లూరు జిల్లా అని, తన చిన్నతనంలోనే నెల్లూరు తనకు కులాల ఐక్యతను నేర్పిందని చెప్పారు. 2009 లో తనకు పదవే కావాలనుకుంటే నెల్లూరు నుండే పోటీ చేసుండేవాడినని చెప్పారు. సమస్యలు అర్థం చేసుకోవాలనే పోటీ చేయలేదని చెప్పారు.
నాకు అలాంటి నేతలు వద్దు
18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువత తమ తొలి ఓటు జనసేనకే అని బల్లగుద్ది చెబుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు అవమానం జరిగి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలు అందరికీ అవమానం జరిగితే వచ్చానని చెప్పారు. తాను పక్కన లేనప్పుడు, జనసేన కోసం మీరు ఎలా పని చేస్తున్నారనేది తనకు కొలమానమని, మీరు సీఎం సీఎం అని కేకలు వేస్తే నేను పొంగిపోనని చెప్పారు. పదవి పైన ఆశతో రాజకీయాల్లోకి వచ్చేవారు తనకు అవసరం లేదన్నారు. నిస్వార్థంగా, కష్టపడి ఈ సమాజం కోసం పనిచేసే ప్రతి ఒక్కరినీ, ఒకరోజు అటూ ఇటూగా నేను గుర్తిస్తానన్నారు.
అందుకే ఎంపీసీ కాక ఎంఈసీ తీసుకున్నా
ప్రతికూల పరిస్థితుల్లో, ఒంటరిగా ఉనప్పుడు, ఓటమిలో ఉన్నపుడు కూడా బలంగా నిలబడి ఉండగలిగే వారే జనసేన నాయకులని, అలాంటి వారు తనకు కావాలని పవన్ అన్నారు. అందుకే పార్టీ నిర్మాణానికి సమయం తీసుకుంటున్నానని చెప్పారు. జనసేన వస్తే పథకాలకు మహానుభావుల పేర్లు పెడతామన్నారు. మా పేర్లు పెట్టుకోమని చెప్పారు. పదో తరగతి పూర్తయ్యాక తాను ఎంపీసీ చదువుదామనుకున్నానని, కానీ సరైన కాన్సెప్టువల్ ఎడ్యుకేషన్ లేక ఎంఈసీ తీసుకున్నానని చెప్పారు.
పవన్ కళ్యాణ్ సినిమా.. ఆలోచించడనుకుంటే పొరపాటు
టీడీపీ, వైసీపీల తీరును చూశారని, వారిది కుటుంబ పాలన అని, ఈసారి కొత్త వ్యక్తులకు అవకాశమివ్వండని, జనసేనకి అవకాశం ఇవ్వండని, మీరు కోరుకున్న మార్పుని తీసుకొస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీరు ఓటు వేస్తేనే, రాజకీయ నాయకులను చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు ఉంటుందని చెప్పారు. ఎవరికీ భయపడకుండా ఓటు వేయాలన్నారు. తాను సినిమా నటుడిని అని, పెద్దగా ఆలోచించలేడని పార్టీలోకి ఎవరైనా వస్తే అది వారి పొరపాటు అన్నారు. రాడికల్ విద్యార్థుల ఉపన్యాసాలు విని పెరిగిన వాడినని చెప్పారు. స్క్రీనింగ్ కమిటీ ముందుకు పలు అప్లికేషన్లు వచ్చాయని, టిక్కెట్ రాని వారు అలిగి వెళ్లిపోయి, తనను తిట్టినా తనకు ద్రోహం చేసినట్లు కాదని, ప్రజలకు ద్రోహం చేసిన వారు అవుతారన్నారు. తనకు ప్రజాసేవ ఇష్టం కాబట్టే ఇన్నేళ్లు పదవులు లేకుండా రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు.