వారెలా ఉన్నా.. నేను స్పష్టంగా, సిద్ధంగా ఉన్నాను.. మీరు ఉన్నారా??
భవిష్యత్తు రాజకీయాలపై తాను పూర్తి స్పష్టంగా, సిద్ధంగా ఉన్నట్లు పవన్ తన మచిలీపట్నం సభద్వారా విమర్శకులకు స్పష్టత ఇచ్చారు.
మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం విన్నవారికి ఒక స్పష్టత వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ఏం చేయాలి? పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు తనతో సహా అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి? భవిష్యత్తులో జనసేనను బలోపేతం చేసి సింగిల్ గా పోటీచేయించే స్థాయికి తీసుకురావాలంటే ఏం చేయాలి? రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణలో భారతీయ జనతాపార్టీతో తెలంగాణలో ఎలా వ్యవహరించాలి? ఏపీలో ఎలా వ్యవహరించాలి? తనను రెచ్చగొడుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు తాను సరైన సమాధానం చెప్పాలంటే ఏం చేయాలి? అనే అంశాలపై పూర్తిస్థాయిలో స్పష్టత ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులకు అర్థమవుతోంది.

ఎలా వ్యవహరించాలో అర్థమవుతోంది?
భారతీయ జనతాపార్టీతో ఏపీలో వ్యవహరించే విధానంలో, తెలంగాణలో వ్యవహరించే విధానంలో కూడా పవన్ కల్యాణ్ స్పష్టతతోనే ఉన్నట్లు, తమకే స్పష్టత లేనట్లుగా ఆయన విమర్శకులకు అర్థమైంది. బీజేపీ తనతో తెలంగాణలో ఎలా వ్యవహరిస్తోంది? గతంలో ఏం చేసింది? భవిష్యత్తులో ఆ పార్టీతో కలవాలా? వద్దా? తెలంగాణలో అయినా, ఏపీలో అయినా, ఏపీలో స్థానిక బీజేపీ నాయకత్వం ఎటువంటి వైఖరి అవలంబిస్తోంది? ఎటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తోంది? మిత్రపక్షంగా జనసేనను పరిగణనలోకి తీసుకుంటుందా? లేదా? ప్రధానమంత్రి పర్యటనల్లో, పార్టీ అధ్యక్షుడి ప్రకటనల్లో జనసేనకు ఎటువంటి ప్రాధాన్యం దక్కుతోంది.. తనతో సహా అనే విషయాలను నాలుగు మాటలతో స్పష్టత ఇచ్చారు.

వ్యతిరేక ఓటు చీలనివ్వనంటున్న పవన్
అలాగే జనసేనను రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేలా చేద్దామనుకుంటున్నవారికి ఈసారి అది జరగనివ్వనని స్పష్టం చేశారు. తనను, తన పార్టీని ఎలా రెచ్చగొడుతున్నారో అన్నీ గమనిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశం ఎక్కడ జరిగినా, ఆవేశంగా, ఆగ్రహంతో ప్రసంగించే పవన్ కల్యాణ్ తెరవెనక ఇంత హోంవర్క్ చేస్తున్నారా? అని రాజకీయ విశ్లేషకులే ఆశ్చర్యపోయారు. పొత్తుకు బీజేపీ వస్తే సరి.. లేదంటే లేదు.. కమ్యూనిస్టులను కలుపుకొని తెలుగుదేశం పార్టీతో పొత్తుకు సిద్ధపడినట్లు ఒక స్పష్టత వచ్చింది.

టీడీపీకి జనసేన అవసరం.. జనసేనకు టీడీపీ అవసరం
వచ్చే ఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం పార్టీకి జనసేన ఎంత అవసరమో.. జనసేనకు తెలుగుదేశం పార్టీ కూడా అంత అవసరమే. అందుకే ఉభయ కుశలోపరిగా, మధ్యేమార్గంగా పొత్తులకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయం చేయాలన్నా.. పార్టీని బలోపేతం చేయాలన్నా ప్రస్తుతానికి పొత్తు పెట్టుకున్నా.. భవిష్యత్తులో తాము బలపడ్డామని అనిపించినప్పుడు పొత్తు నుంచి బయటకు వచ్చి విడిగా పోటీచేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. 25 నుంచి 30 సంవత్సరాల వరకు రాజకీయం చేయడానికే వచ్చామని చెబుతున్న పవన్ కల్యాణ్ పదో ఆవిర్భావాన్ని పూర్తిచేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పదుల సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలను తనతో సహా అసెంబ్లీకి పంపించాలనే కృత నిశ్చయాన్ని మాత్రం ఆయన వ్యక్తపరిచారు. ఆయన ఆకాంక్షలు, ఆయన ఆలోచనా తీరు.. ఆయన భవిష్యత్తు ప్రణాళికను ఒక్క సభ పూర్తి వివరాలను తెలియజేసింది. భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఒక స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.












Click it and Unblock the Notifications