జనసేన పోటీ చేసే స్థానాలు ఫైనల్ - జిల్లాల వారీగా ఇలా..!!
ఏపీలో ఎన్నికల సంగ్రామం హోరా హోరీగా సాగుతోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తొలి జాబితా విడుదల చేసారు. జనసేన ఈ ఎన్నికల్లో 24 అసెంబ్లీ స్థానాల్లో, మూడు ఎంపీ సీట్లలో పోటీ చేయనుంది. తొలి జాబితాలో పవన్ 5 నియోజకవర్గాలకు అభ్యర్దులను ఖరారు చేసారు. తొలి జాబితా ప్రకటన తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో మిగిలిన స్థానాల పై ఖరారు పై చంద్రబాబు, పవన్ చర్చ చేసారు. జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు చేసారు.
19 స్థానాలు ఖరారు: ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల పై తుది నిర్ణయం జరిగింది. తొలి జాబితాలో అనకాపల్లి, తెనాలి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్, రాజానగరం స్థానాలకు పవన్ తమ అభ్యర్దులను ఖరారు చేసారు. తాను పోటీ చేసే స్థానంతో పాటుగా మరో 19 నియోజకవర్గాలను ఖరారు చేయాల్సి ఉంది. తొలి జాబితా ప్రకటన తరువాత రెండు పార్టీల్లో ఆశావాహుల నుంచి వచ్చిన స్పందనలతో ఇప్పుడు ఇరు పార్టీల అధినేతలు రెండో జాబితా పైన కసరత్తు చేసారు.

బీజేపీ కూటమిలో చేరటం దాదాపు ఖాయం కావటంతో సీట్ల పంపకాల పైన ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 6, తూర్పుగోదావరిలో 5, విశాఖపట్నం జిల్లాలో 4, కృష్ణాజిల్లాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా ల్లో ఒక్కోచోట జనసేన బరిలోకి దిగనుంది.
టీడీపీ -జనసేన సర్దుబాటు: విశాఖలో జనసేనకు కేటాయించిన పెందుర్తి స్థానం బదులుగా మాడుగుల సీటు ఇవ్వాలని నిర్ణయించారు. అమలాపురం బదులుగా పి గన్నవరం జనసేనకు ఇవ్వటం పైన చర్చ జరిగింది. తిరుపతి సీటు జనసేన ఖాతాలోకి వెళ్లడంతో అక్కడ పోటీ పెరిగింది. తాజాగా జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, వ్యాపారవేత్త గంటా నరహరి, జనసేన సీనియర్ నేత హరిప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి.
ప్రకాశం జిల్లాకు చెందిన దివంగత మాజీమంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనవరాలు లక్ష్మి అదే జిల్లాలో దర్శి టికెట్ను ఆశిస్తున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయటం దాదాపు ఖాయమైందని చెబుతున్నారు. మొత్తం 19 నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్దులను ఒకే విడతగా రెండో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది.
జనసేన సీట్లు ఇవే: జనసేనకు కేటాయించిన సీట్లలో..శ్రీకాకుళం జిల్లా-పాలకొండ (ఎస్సీ); విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల; విశాఖపట్నం-విశాఖ దక్షిణ, పెందుర్తి/మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి; తూర్పుగోదావరి-కాకినాడ రూరల్, రాజోలు(ఎస్సీ), రాజానగరం, అమలాపురం/పి.గన్నవరం, పిఠాపురం; పశ్చిమగోదావరిలో -భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం(ఎస్టీ) ఉన్నాయి.
కృష్ణా-విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ; గుంటూరు- తెనాలి; ప్రకాశం జిల్లాలో-దర్శి; చిత్తూరు-తిరుపతి), అనంతపురం-అనంతపురం; కడప- రైల్వేకోడూరు నియోజకవర్గాలు ఉన్నాయి. బీజేపీతో సీట్ల పైన ఒప్పందం జరిగిన తరువాత టీడీపీ, జనసేన ఈ సీట్ల ఖరారు మేరకు అధికారికంగా తమ అభ్యర్దులను ప్రకటించనున్నాయి.












Click it and Unblock the Notifications