జనసేన బహిరంగ సభ...వేదిక...విశేషాలు...ఇలా మొదటిసారి
గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికను ఇవాళ ప్రకటించనున్నారు. రాజధాని ప్రాంతం వేదికగా చేసుకొని ఆయన తన ఆలోచనలు, ఆశయాలు, ఆకాంక్షలు నేడు ప్రజల ముందు ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గల 14 ఎకరాల విశాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న సంగతి తెలిసిందే. జనసేనాని అంతరంగ ఆవిష్కారానికి తగిన విధంగా...ఆయన కోరుకునేరకంగా...సభా వేదికను రూపొందించేందుకు జనసేన సైన్యం నిర్విరామంగా కృషి చేస్తోంది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంగణంలో అశేష జనవాహినీ తరలివచ్చేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా సభా వేదికతో సహా వివిధ అంశాలకు సంబంధించి ప్రతీదీ ప్రత్యేకంగా ఉండేలా జనసేన పార్టీ వర్గాలు ఈ సదస్సును నిర్వహించనున్నాయి. వేదిక విషయాని కొస్తే 120 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పుతో సభ వేదికను డిజైన్ చేశారు. దీన్ని ఒకే వేదికలా కాకుండా....మూడు విభాగాలుగా నిర్మించారు. అలాగే ప్రతి భాగానికి ఒక ప్రవేశ ద్వారం ఉండేలా...ఇలా అన్నివిభాగాలకు మధ్యలో నేరుగా మార్గం ఉండేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఎక్కడా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పక్కా ప్రణాళికలు సిద్దం చేశారు. వేదిక వెనుకభాగంలో అతి పెద్ద భారీ ఎల్ఈడి స్ర్కీన్ను ఏర్పాటు చేశారు.
గతంలో ఏ రాజకీయ సభలకు అమలు చేయని విధంగా ఈ జనసేన సభకు బార్కోడ్ విధానాన్నిఅనుసరిస్తుండటం విశేషం. ఇందుకోసమే వీటికి కావాల్సిన కంప్యూటర్లతో పాటు ఇతర పరికరాలను జనసేన పార్టీ నిర్వాహకులు కొనుగోలు చేశారు. ఇకపై జనసేన రాజకీయ ప్రస్థానం చురుకుగా సాగనున్న దృష్ట్యా సౌండ్ సిస్టమ్, లైటింగ్, ఎల్ఈడి స్ర్కీన్లను కూడా తాత్కాలిక అవసరానికి కాకుండా శాశ్వత ప్రాతిపదికన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
జనసేన పార్టీ చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణా జిల్లాల నుంచి జనం పెద్ద ఎత్తున హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రాథమికంగా నాలుగు నుంచి ఐదు లక్షల మంది వరకు జనాలు తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏర్పాట్లు కూడా ఆ స్థాయికి తగినట్లు చేయడంతో పాటు ఇంతమంది రాక వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందే సిద్దం చేసిన వ్యూహం అమలు చేయడం జరుగుతోంది.
జనసేన కు సంబంధించి అత్యంత కీలకమైన ఈ సభలో వేదికపై ఏఏ నేతలు ఉంటారనే వివరాలు ఇంకా జనసేన పార్టీ వెల్లడించలేదు. ఇది కూడా వ్యూహాత్మకంగా సస్పెన్స్ గా ఉంచినట్లు తెలుస్తోంది. ఇటీవల జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాయింట్ ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీలో సభ్యులుగా వ్యవహరించిన జేపీ, ఉండవల్లి, కృష్ణారావు, పద్మనాభయ్య వంటి వారు ఈ సభకు వస్తారా?...రారా?...అనేది ఆసక్తికరంగా మారింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సభా వేదిక నుంచి జనసేన పార్టీ ఆధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఇక సభ ప్రారంభానికి ముందు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, వీలైనప్పుడల్లా జనసేన పార్టీకోసమే ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్రూబెన్స్ రూపొందించిన పాటను వినిపిస్తారని తెలిసింది. ఏదేమైనా ఏపీలో రాజకీయంగా అత్యంక కీలమైన ఈ తరుణంలో జనసేనాని పవన్ కళ్యాణ్ నిర్వహించనున్న ఈ బహిరంగ సభ అటు రాజకీయంగానే కాదు...ఇటు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.