ఔను నిజమే.. ఆధారాలున్నాయి: నాగబాబు
తనకు రెండు ఓట్లున్నాయి.. అన్న వివాదంపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. వివాదాస్పదం అవడం ఇష్టం లేకనే తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయలేదన్నారు. హైదరాబాద్ లో తనకు ఉన్న ఓటును రద్దు చేసుకున్నానని, దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. తన ఓటును ఏపీకి మార్చుకొని టీడీపీ-జనసేన కూటమికి మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందినవారు కావాలనే దీన్ని వివాదం చేస్తున్నారన్నారు.
తనకు రెండు ఓట్లు ఉన్నట్లు రాజకీయాలకు సంబంధించిన ఓ కామెడీ మ్యాగజైన్ వార్త రాసిందని సైటైర్లు వేశారు. తన భార్యాపిల్లలు, కోడలు కూడా మంగళగిరిలో ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నామని, మంగళగిరిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓట్లు రాకుండా బూత్ స్థాయిలోనూ వైసీపీ నాయకులు అడ్డుపడుతున్నారన్నారు.

ఎన్నికలకు మూడు నెలలో సమయం ఉందని, టీడీపీ-జనసేన నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. వైసీపీ నాయకులకు పరిపాలన అంటే అపహాస్యం అయిందని, చివర్లో నోట్లిస్తే ఓట్లు వేస్తారనే గుడ్డి నమ్మకంతో ఉన్నారన్నారు. జలవనరుల శాఖ మాజీ మంత్రి ఏడాదిలో పోలవరం పూర్తిచేస్తామన్నారని, ఇప్పుడు అడుగుతుంటే సమాధానం ఉండటంలేదన్నారు.
మంత్రి గోవర్ధన్ రెడ్డి మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నామని నాగబాబు అన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసికట్టుగా ప్రజా సమస్యలపై పోరాడతాయన్నారు.












Click it and Unblock the Notifications