తిరుపతి: పవన్ కల్యాణ్ ఆఖరి అస్త్రం -లౌకిక సిద్ధాంతం -కరోనా వార్నింగ్ -బీజేపీ రత్నప్రభ ఎందుకంటే
ప్రతిష్టాత్మక తిరుపతి లోక్ సభ స్థానంలో ఉప ఎన్నిక ప్రచార పర్వం గురువారం సాయంత్రంతో ముగిసింది. ప్రచార గడువుకు కొద్ది నిమిషాల ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆఖరి అస్త్రంగా తిరుపతి ఓటర్లను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. కరోనా బారిన పడకుండా తిరుపతి ఓటర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభ ఎందుకు గెలవాలనే కారణాలను వివరించారు. ప్రకటనలో పవన్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
శభాష్ అచ్చెన్న! -17న వైసీపీలో చేరికా? -విజయసాయిరెడ్డి అనూహ్య వ్యాఖ్యలు-జగన్ పెట్టుబడి రహస్యం ఇదే
బీజేపీతోనే అది సాధ్యం..
''తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పారిశ్రామిక అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఏర్పేడు - శ్రీకాళహస్తిలో ఇండస్ట్రియల్ కారిడార్ ను తీర్చిదిద్దితే మన యువత ఉద్యోగాలు, ఉపాధి కోసం వలసలు వెళ్ళే దుస్థితి ఉండదు. తిరుపతి పార్లమెంట్ పరిధితోపాటు పరిసర జిల్లాల సర్వతోముఖాభివృద్ధి కేంద్రంలో నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీకి సాధ్యమవుతుంది. ఈ నెల 17న జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఉన్నికలో కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను..
రత్నప్రభకు మాత్రమే సత్తా ఉంది..
తిరుపతి ఎంతో అభివృద్ధి చెందాల్సిన ప్రాంతం. అయితే పార్లమెంట్లో బలంగా మాట్లాడి.. ఇక్కడి పరిస్థితులను సమగ్రంగా వివరించి కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసే సత్తా ఉన్నవాళ్ళను ఎంపీగా ఎన్నుకోవాలి. అలాంటి శక్తిసామర్థ్యాలు రత్నప్రభకు మాత్రమే ఉన్నాయి. ఐఏఎస్ అధికారిణిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించి, ప్రజా క్షేమం గురించి ఆలోచించారామె. అధికారిణిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రశంసలు పొందారు. తిరుపతిలో నిలబడ్డ ఇతర పార్టీల అభ్యర్థులు వారి పార్టీ అధినాయకుల సేవలోనే తరిస్తారు తప్ప ప్రజాసేవ గురించి ఆలోచించరు. కేంద్రం దగ్గర మాట్లాడే సమర్థత వారికి ఉండదు. కాబట్టి ప్రజలకు నిరంతర సేవ చేసి, ఈ ప్రాంతం అభివృద్ధి చేసే సత్తా బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మాత్రమే ఉంది.
లౌకిక సిద్ధాంతాన్ని పాటిస్తాం..
తిరుపతి సమస్త హిందువులకు పవిత్ర క్షేత్రం. ఇక్కడ ధర్మ పరిరక్షణకు నడుంబిగించి, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను, ఆచార సంప్రదాయాలను కాపాడటం మనందరి బాధ్యత. సర్వమత సమానత్వం అనే లౌకిక సిద్ధాంతాన్ని పాటిస్తాం. అదే సమయంలో 150కిపైగా హిందూ ఆలయాలపై దాడులకు తెగబడ్డా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ తీరును, ఆ దాడుల గురించి ప్రశ్నిస్తే హేళనగా మాట్లాడి, తిరుమల శ్రీవారి నామాలుపెట్టుకొనేవారిపై చులకనగా వ్యాఖ్యలు చేసి భక్తుల మనోభావాలను గాయపరిచిన మంత్రుల వైఖరినీ ప్రతి ఒక్కరం కచ్చితంగా తప్పుబట్టాలి. అందుకు తగిన సమాధానం తిరుపతి ఉప ఎన్నికలో చెప్పాలి. బీజేపీని గెలిపించాలి. చివరిగా..
పోలింగ్ వేళ బహుపరాక్..
ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. తిరుపతి పోలింగ్ సమయంలో ప్రతి ఒక్కరం స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పోలింగ్ స్టేషన్లకు వెళ్లి, ఓటు వేయాలి. రాష్ట్ర ప్రజలందరూ కరోనా తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ బారినపడినవారు కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాను'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయితే..
వకీల్ సాబ్కు అలా ఓటర్లకు ఇలా..
ఏపీ సహా దేశమంతటా కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి విలయతాండవం సృష్టిస్తున్నది. జనజీవనం స్తంభించొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వాలు లాక్ డౌన్ కు విముఖత చూపుతున్నప్పటికీ, ప్రజలంతా జాగ్రత్తలు వహించాలని హెచ్చరిస్తూ, పలు రకాల ఆంక్షలు విధించాయి. కాగా, జనసేనాని పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తాజా సినిమా 'వకీల్ సాబ్' వేడుకలను, ఆ సినిమా ప్రదర్శనలున్న సినిమా థియేటర్లకు జనం పోటెత్తడంతో వైరస్ వ్యాప్తి భయాలు వ్యక్తమయ్యాయి. వకీల్ సాబ్ సినిమా వేడుకలో కరోనా వైరస్ వ్యాప్తిచెంది, నిర్మాతలతోపాటు పలువురు నటులు పాజిటివ్ గా నిర్ధారణ కావడం, పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కూడా వైరస్ కాటుకు గురికవావడం, దీంతో పవన్ కల్యాణ్ సైతం ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉండటం తెలిసిందే. తిరుపతి ఓటర్లకు కరోనా జాగ్రత్తలు చెబుతూ పవన్ చేసిన ప్రకటనపై భిన్న కామెంట్లు వెలువడ్డాయి. కరోనా వ్యప్తి నేపథ్యంలో వకీల్ సాబ్ సినిమా విషయంలో ఒకలా, తిరుపతి ఓటర్లకు మరోలా పవన్ సందేశం ఉన్నట్లు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తిరుపతిలో మాదే విజయం-ఇంత వ్యతిరేకతా- కొడాలి ఆంబోతు వ్యాఖ్యలు- చంద్రబాబు