అలిగిన జనసేనకు మరో పదవి?
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఊహించినట్టే.. టీడీపీ- బీజేపీ మధ్య పొత్తు కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు.
పవన్ కల్యాణ్తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరు శాసన సభ్యులు- నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్కూ కేబినెట్ హోదా లభించింది. ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను నాదెండ్ల స్వీకరించారు. పర్యాటకం, సాంస్కృతికం, సినిమాటోగ్రఫీ శాఖలు కందుల దుర్గేష్కు దక్కాయి.

అక్కడి దాకా అంతా బాగానే ఉన్నప్పటికీ- 21 మంది శాసన సభ్యుల బలం ఉన్న జనసేనకు మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత లభించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. రాయలసీమ, దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి జనసేన ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ.. వారిని పక్కన పెట్టారనే వాదనలు అప్పుడే వెలువడుతున్నాయి. ఈ ప్రాంత జనసేన నాయకుల్లో అసంతృప్తి రాజుకుందంటూ వార్తలు వస్తోన్నాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందుజాగ్రత్త పడినట్టే కనిపిస్తోంది. జనసేనకు మరో పదవిని ఆఫర్ చేయనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆయన నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఈ సమాచారాన్ని జనసేన అగ్రనాయకత్వానికి అందించారని, ఈ పదవి కోసం పేర్లను సూచించాలని కోరినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో కాకినాడ రూరల్ శాసన సభ్యుడు పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లను సూచించినట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం ఖాయమని అంటున్నారు. మహిళా కోటాలో లోకం మాధవి వైపే చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొగ్గు చూపారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications