ఆర్టీసీ విలీనం పై జేపీ సంచలనం: జగన్ ది తిరోగమన చర్య..ఓట్ల కోసమే: కేసీఆర్..కార్మికుల సమ్మెపై ఇలా..!
Recommended Video
ఆర్టీసీ సమ్మె తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్తతలకు కారణమవుతున్న వేళ..మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జయ ప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆర్టీసీ సమ్మె సమంజసం కాదన్నారు. కార్మికులు ప్రజల కోసం పని చేయాలని..సమ్మె కాకుండా చేతికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియచేయాలని సూచించారు. ఆర్టీసీ ప్రయివేటుతో పోటీ పడితేనే.. వినియోగదారుడికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం తిరోగమన చర్యగా అభివర్ణించారు.
తాత్కాలికంగా ఓట్ల కోసం ఈ నిర్ణయం తీసుకోవటం హేతుబద్దత కాదని పేర్కొన్నారు. ఆర్టీసీలో పోటీతత్వం పెంచాలని..ప్రభుత్వంలో విలీనం చేయటం సరికాదన్నారు. ఇప్పటికైనా ఈ నిర్ణయం పైన పునరాలోచన చేయాలని కోరారు. అదే సమయంలో కేసీఆర్ ఆలోచనలతో జేపీ ఏకీభవించారు. ఆర్టీసీ భవిష్యత్ కోసం రాయితీలు భర్తీ చేయాలి కానీ..ప్రభుత్వంలో విలీనం సరి కాదంటూ జేపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
జగన్ నిర్ణయం పైన జేపీ కామెంట్స్..
ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో మాజీ ఐఏయస్.. లోక్ సత్తా మాజీ అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ విభేదించారు. తాత్కాలికంగా ఓట్ల ప్రయోజనాల కోసం ఇటువంటి నిర్ణయాలు సంస్థ తిరోగమనానికి కారణమవుతాయని చెప్పుకొచ్చారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు చెల్లించాలని.. వ్యాపార సంస్థగా ఆర్టీసీలో పోటీ తత్వం పెంచాలని సూచించారు. డీజిల్ ధరలు పెరిగినా..ప్రజల్లో రాజకీయ సానుకూలత కోసం టిక్కెట్ ధరలు పెంచకుండా సంస్థకు నష్టం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులకు దీర్ఘ కాలికంగా మంచిది కాదని జేపీ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఆర్టీసీ సిబ్బంది వేతనాలు ప్రభుత్వానికి గుదిబండగా మారుతాయని హెచ్చరించారు.
సీఎం జగన్ పునరాలోచించాలి..
ఇక వైపు ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా..తెలంగాణలో ప్రస్తుతం సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ గా అదే అంశం మారింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం దిశగా ఎటువంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో ప్రయివేటీకరణ చేయటం లేదని.. 20 శాతం వరకు మాత్రమే బస్సులకు అవకాశం కల్పిస్తున్నామని చెబుతూ..సమ్మెలో ఉన్న ఉద్యోగుల కొలువుల గురించి టెన్షన్ పుట్టించే వ్యాఖ్యలు చేస్తోంది. ఇదే సమయంలో జేపీ చేస్తున్న వ్యాఖ్యల పైన కార్మిక సంఘాల్లో చర్చ సాగుతోంది. రవాణా రంగంలో ప్రభుత్వ రవాణా మంచిది కాదని.. దీని పైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ పునరాలోచన చేయాలని జేపీ సూచిస్తున్నారు.
కేసీఆర్ ఆలోచనలకు బాసటగా..
ఇక, జేపీ ఇదే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఆలోచనలకు బాసటగా నిలిచారు. ప్రయాణీకుల కోసం ఆర్టీసీ ఉందని..కార్మికులు సమ్మె బాట పట్టకుండా నల్ల రిబ్బెన్లు కట్టుకొని నిరసన తెలియ చేయాలని సూచించారు. ఆర్టీసీ ప్రయివేటు లో ఉంటేనే పోటీ ఉంటుందని..ఆ సంస్థకు ప్రభుత్వం నుండి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించటం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందన్నారు. విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తే సంస్థకు మరింత నష్టం తప్పదన్నారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీలో నష్టాలు మరింతగా పెరిగిపోయతాని జేపీ హెచ్చరించారు.