శేషాచల ఎన్కౌంటర్: బాధిత కుటుంబాలకు ఉద్యోగాలిచ్చిన తమిళ సీఎం
చెన్నై: శేషాచల ఎన్కౌంటర్ బాధిత కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి సీఎం జయలలిత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 7న చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది తమిళ కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.
తమ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక దారి చూపాలంటూ సీఎం జయలలితను కొన్ని రోజులుగా బాధిత కుటుంబాలు వేడుకుంటున్న నేపథ్యంలో గురువారం 20 కుటుంబాలకు చెందిన ఒక్కో వ్యక్తిని పలు రకాల ఉద్యోగాల్లో వారిని ప్రభుత్వం నియమించినట్టు అధికారిక ప్రకటనలో తెలిపారు.
బాధిత కుటుంబాలకు చెందిన 17 మందిని వంట సహాయకులుగా, మరో ఇద్దరిని పోషకాహార సమన్వయకర్తలుగా నియమించారు. ఒకరిని అంగన్ వాడీ సహాయకులుగా నియమించినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నాటి ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారం గతంలోనే ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది 7న చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. చంద్రగిరి మండలం ఈటపాక అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో 20 మంది స్మగ్లర్లు హతమయ్యారు.
మృతులందరూ తమిళనాడుకు చెందిన కూలీలే. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలన సృష్టించింది. ఈ ఘటనపై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనను తెలిపారు. ఈ ఎన్కౌంటర్ ఘటన అనంతరం తమిళనాడులోని ఆంధ్రా వారి ఆస్తుల పైన, సంస్థల పైన దాడులు జరగవచ్చుననే అనుమానాలతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.