హోదా నేనే చెప్పా, 'హైదరాబాద్' ఆదాయం కేంద్రం ఇవ్వాలి: జేపీ
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే నినాదం తెచ్చింది తానేనని లోక్సత్తా వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ అన్నారు. శనివారం లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఏపీకి హోదా నినాదం తానే తెచ్చానని చెప్పారు. విభజన వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టాలను పూడ్చవలసింది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. విభజన అనంతరం హైదరాబాదును పోగొట్టుకోవడం వల్ల ఏపీకి ఉత్పన్నమైన సమస్యల పరిష్కారానికి పాలకులు, రాజకీయ పార్టీలు సరైన రీతిలో స్పందించడం లేదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైదరాబాద్ ద్వారా వచ్చే మిగులు ఆదాయాన్ని 23 జిల్లాలు పంచుకునేవి అని చెప్పారు. విభజన తర్వాత ఈ ఆదాయం ఏపీలోని జిల్లాలకు రావడం లేదని చెప్పారు. ఈ నష్టాన్ని పూడ్చవలసిన బాధ్యత కేంద్రానిదే అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలన్నారు.
ప్రతిపక్ష నేతలపై తెలుగు రైతు నేతల ఆగ్రహం
పోర్టు, ఆధారిత పరిశ్రమల స్థాపన కోసం శ్రమిస్తుంటే ప్రతిపక్ష నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారే తప్ప వారికిస్తున్న ప్యాకేజీపై మాట్లాడటం లేదని కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు శనివారం అన్నారు.
రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని జీవోలో పేర్కొన్నారన్నారు. రైతులు స్వచ్ఛందంగా తమ భూములను ఇవ్వడానికి ముందుకు వస్తే వారి ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రభుత్వం ఉందన్నారు. రైతులకు న్యాయం చేసేలా పోరాడుతున్నామని, ప్రతిపక్ష నాయకులు సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప రెచ్చగొట్టే విధంగా ప్రయత్నించకూడదన్నారు.