ఏదో ఆశించే పార్టీలో చేరుతాం, నా పద్ధతి నాదే: టిడిపి నేత జయసుధ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో చేరినప్పటికీ తాను తన పద్ధతిలోనే ఉంటానని, ఎవరైనా పార్టీలోకి వచ్చేది కచ్చితంగా ఏదో ఒకటి ఆశించేనని సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
తాను గతంలో వైయస్సార్ కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తానని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని కొట్టిపారేశారు. రాజకీయాల్లో అందరూ ఒకేలా ఉండాలని లేదని, తాను తన పద్ధతిలోనే కొనసాగుతానని చెప్పారు. సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే పెద్ద నటులు ఉన్నారని ఆమె అన్నారు.
మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో పోటీకి తనను ఎవరు కూడా బలవంత పెట్టలేదని చెప్పారు. మా ఎన్నికల అనంతరం సినిమా పరిశ్రమ అంత ఒకటేనని చెప్పారు. ఇప్పటి హీరోయిన్లు అయిదేళ్లు నటించడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డారు.
పార్టీలోకి ఎవరు వచ్చినా ఆశించే వస్తారని చెప్పారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీ అయితే ప్రజలకు మేలు చేయవచ్చునని తాను తెలుగుదేశం పార్టీలో చేరానని చెప్పారు. సినిమా తారలు రాజకీయాల్లోను ప్రత్యేక గుర్తింపు కోరుకుంటారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ అధిష్టాం ఆదేశిస్తే హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. తాను కుల రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పారు. పార్టీ భవిష్యత్తు దృష్ట్యా తనకు ఏ పదవి ఇచ్చినా స్వాగతిస్తానని చెప్పారు. తనకు తెలుగుదేశం పార్టీతో ముందనుంచే అనుబంధం ఉందని చెప్పారు.
రాజకీయ పార్టీ అన్నప్పుడు.. ఓటు కావాలి, పార్టీ ప్రచారం కావాలి, పవర్ (అధికారం) కావాలి అన్నారు. హైదరాబాదును హైటెక్ సిటీగా చేసింది చంద్రబాబునాయుడేనని చెప్పారు. ఆ గౌరవం ఆయనకు ఎప్పటికీ ఉంటుందని జయసుధ చెప్పారు.