జగన్పై మరోసారి జెసి సంచలనం: రోజాపై కాలు దువ్విన అనిత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారంనాడు మీడియా ప్రతినిధుల వద్ద ఆయన జగన్పై దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.
యంగ్ ఫెలో జగన్ వల్ల తామంతా దెబ్బలు తింటున్నామని అన్నారు. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, అనంతపురంలో పర్యటించానని, ఎక్కడ కూడా జగన్ పరిస్థితి సరిగా లేదని ఆయన అన్నారు. జగన్ ఉంటాడో, ఊడుతాడో, బయట ఉంటాడో, లోపలికి వెళతాడో తెలియక ప్రజలు చస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రెడ్డి కులానికి చెందిన వారంతా త్రిశంకు స్వర్గంలో అల్లాడుతున్నారని జేసీ తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలపై చంద్రబాబు కొరడా ఝులిపించాల్సిన అవసరముందని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు కొరడా తీయాలి..ఇదే మాట చాలా సార్లు ఆయనకు చెప్పామని తెలిపారు. కొరడా తీయకపోతే ఆఖరికి చంద్రబాబు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. బాబు కొరడా తీస్తే అంతా బాగుంటుంది..లేకపోతే అంతేనని జేసీ అన్నారు.
చంద్రబాబు ఒక్కరే కష్టపడితే సరిపోదు..ఎమ్యెల్యేలు కూడా కష్టపడితేనే అభివృది సాధ్యమని జేసీ దివాకర్రెడ్డి సూచించారు. పార్టీల దిగజారుడుతనం ఎక్కువైందన్నారు.సభ సజావుగా నడిచేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనని జేసీ తెలిపారు. ప్రత్యక్ష ప్రసారాలు లేకపోతే సభ ఇంకా సజావుగా నడుస్తుందని జేసీ చెప్పారు.
ఇదిలావుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా సవాల్కు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు అనిత సై అన్నారు. తప్పు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రోజా తన మాటలకు కట్టుబడి ఉండాలని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై రోజా వ్యాఖ్యలను అనిత తప్పుబట్టారు. చంద్రబాబు తనను పావుగా వాడుకుంటున్నారన్న మాట వెనక్కి తీసుకోవాలని అనిత డిమాండ్ చేశారు. జగనే రోజాను పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. తనపై సానుభూతి మానుకుని రోజా తన పని చూసుకోవాలని సూచించారు. రోజాను చూస్తుంటే జాలేస్తోందని ఆమె అన్నారు.