పరిటాల హత్యతో నాకు లింక్ లేదు: జగన్పై జెసి ఫైర్
ఈ హత్య కేసుకు సంబంధించి తనపై గతంలోనే విచారణ చేశారని, అవసరమనుకుంటే మరోసారి విచారణకు తాను సిద్ధమని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల రవి హత్యతో తనను ముడిపెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
కెసిఆర్కు ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని మాచర్ల అయితే బాగుంటుందని దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమలో రాజధాని ఉండాలని ఎవరు మొత్తుకున్నా వినేనాధుడే లేడని, అడగకుండా ఉంటేనే మంచిదని ఆయన తెలిపారు. రాజధాని మధ్యలో ఉంటేనే మంచిదని జేసీ అభిప్రాయపడ్డారు. విభజన అనంతరం పశ్చాత్తాప పడుతున్నది కాంగ్రెస్ నేతలే అని ఆయన అన్నారు. ఏపీ రాజధానిపై సూచనలిచ్చిన కేసీఆర్కు జేసీ దివాకర్రెడ్డి ధన్యవాదులు తెలిపారు.
తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఎప్పుడో జరిగిన పరిటాల రవీంద్ర హత్య కేసులో ఇప్పటికైనా తనపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సోమవారం మీడియా ద్వారా ఆయన హెచ్చరించిన విషయం తెలిసిందే.
తన ఆస్తుల వివరాలపై అసత్య ఆరోపణలు చేస్తే దావా వేస్తానని ఆయన తెలిపారు. పరిటాల రవీంద్ర హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జెసి దివాకర్ రెడ్డి సోదరులను తెలుగుదేశం పార్టీలోనే చేర్చుకున్నారని జగన్ గుర్తు చేశారు.