ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి, అఖండ్ భారత్: పాకిస్తాన్పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం పార్లమెంటు సభ్యులు జేసీ దివాకర్ రెడ్డి ఆదివారం నాడు పాకిస్తాన్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పైన భారత్ యుద్ధం ప్రకటించాలని, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవాలన్నారు. యుద్ధంలో 10 కోట్ల మంది ప్రజలు చనిపోయినా చింత లేదని వ్యాఖ్యానించారు.
అఖండ భారత్గా ఉంటేనే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రోజు చచ్చి బతికే కంటే యుద్ధమే శరణ్యమన్నారు. సైన్యానికి ఖర్చు పెట్టే వేల కోట్లతో దేశంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చునని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.
మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూల తప్పిదం వల్లే పాకిస్తాన్ ఏర్పాటయిందన్నారు. నాటి నేతలు దూరదృష్టితో ఈ పరిస్థితిని ఊహించలేకపోయారని, ఇప్పటికైనా కేంద్రం ముందడుగు వేయాలని కోరారు. అనంతపురం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
హోదాపై మభ్యపడుతున్నాయి: సురవరం
ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మభ్యపెడుతున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఆదివారం ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశంలో ప్రధాని మోడీని ఒప్పించలేకే గందరగోళ ప్రకటనలు చేస్తున్నారన్నారు. ప్రత్యేక ప్యాకేజీ హోదాకు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. ఫెయిలైన సినిమాకు వెంకయ్య, చంద్రబాబు ప్రచారం చేస్తున్నారన్నారు.