సీఎం కేసీఆర్ తో జేసీ దివాకర్ భేటీ - తెలంగాణకే వస్తా : తాడిపత్రిలో పోటీ చేయం- ఏపీలో ఓటు 4 వేలు..!!
సీనియర్ పొటిటీషియన్..టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మరో సారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆయన ఆకస్మికంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ రోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం కార్యాలయంలో కేసీఆర్ ని కలిసిన జేసీ దివాకర్ రెడ్డి కాసేపు ముచ్చటించారు. ఆ తరువాత అసెంబ్లీ లాబీల్లో మంత్రి కేటీఆర్ తోనూ ఏకాంతం గా మంతనాలు జరిపారు. ఇక, ఇదే సమయంలో జేసీ దివాకర రెడ్డి తాను ఏపీ వదిలేసి తెలంగాణకు వస్తానంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను వదిలిపెట్టి నష్టపోయామని అన్నారు.

తెలంగాణ రాజకీయాలు బాగున్నాయి
జానారెడ్డి తనకు మంచి మిత్రుడని.. అయితే సాగర్ ఉప ఎన్నికలో గెలవడం కష్టమని ఆనాడే చెప్పాన్నారు. జానారెడ్డి ఎందుకు ఓడిపోయారో అందరికీ తెలుసునని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాలు, సమాజం కూడా అంతగా బాగోలేదని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను రాష్ట్ర విభజన సమయంలో రాయల తెలంగాణ అంటే జైపాల్ రెడ్డి ఒప్పుకోలేదని గుర్తు చేసారు. ఏపీ కన్నా.. తెలంగాణలో రాజకీయాలు బాగున్నాయని తెలిపారు. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి తనకు తెలియదన్నారు. తాను కేసీఆర్ సీఎం అయిన తరువాత కలవలేదని..అందుకే మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని చెప్పారు.

కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసా
రాయల తెలంగాణ ఏర్పడితే అందరం బాగుండేవాళ్లమని చెప్పుకొచ్చారు. సీమ వాసులకు అన్యాయం జరిగిందని..తెలంగాణతోనే కలిసి ఉండాల్సిందని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలతో జేసీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీకి వచ్చి తెలంగాణ కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడవద్దని సూచించారు. ఏదైనా రాజకీయం మాట్లాడాలంటే బయట మాట్లాండాలంటూ సూచించారు. దీంతో.. దివాకర్ రెడ్డి వెంటనే జీవన్ రెడ్డికి సారీ చెప్పారు.

తాడిపత్రిలో పోటీ చేయనని చెప్పా
ఇక, ఏపీ రాజకీయాల పైన జేసీ కీలకంగా స్పందించారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఓటుకు నాలుగు వేలు అవుతుందని వ్యాఖ్యానించారు. తాడిపత్రి లో పోటీ చేయమని తాను చెప్పానని..అయితే, తమ్ముడు ప్రభాకర రెడ్డి తనకు చెప్పకుండా నామినేషన్ వేయిండాని దివాకర్ రెడ్డి వివరించారు. ఇక, నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకుంటే మాకు అంతకు మించి అవమానం ఉండదని దివాకర్ రెడ్డి విశ్లేషించారు. అందుకే పోటీ చేయించానంటూ జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. అయితే, కొంత కాలంగా దివాకర్ రెడ్డి రాజకీయంగా మౌనం పాటిస్తున్నారు.

ఏపీలో ఇక ఓటుకు నాలుగు వేలు
ఆయన సోదరుడు..తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర రెడ్డి జిల్లాలో టీడీపీ నేతల పైన అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కొందరు పార్టీని నాశనం చేస్తున్నారని.. చంద్రబాబు మేల్కొనాలని వ్యాఖ్యానించారు. ఆ తరువాత జిల్లా టీడీపీ నేతలు మొత్తంగా ప్రభాకర్ రెడ్డి పైన రాజకీయంగా విమర్శలు చేసారు. ఇప్పుడు, దివాకర్ రెడ్డి నేరుగా తెలంగాణ సీఎంను కలవటం... ఏపీలో ఓట్ల గురించి వ్యాఖ్యలు చేయటం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications