కులపిచ్చి విడనాడండి: చంద్రబాబు, జగన్లపై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం కూడు పెట్టదని, ప్రజలు కులపిచ్చి విడనాడాలని సూచించారు. కులభిమానంతోనే రెడ్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్లారని అన్నారు. అంతకు మించి మరే కారణం లేదని ఎద్దేవా చేశారు.
కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న జేసీ దివాకర్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడారు. రాయలసీమను రతనాలసీమగా మార్చడంలో చంద్రబాబు సఫలమవుతారని చెప్పారు.
కులాభిమానంతో కాకుండా అభివృద్ధికి ఓటేయాలని జేసీ సూచించారు. ఎన్టీఆర్, చంద్రబాబు, శ్రీరామకృష్ణయ్యది ఏ కులం అని రాయలసీమకు నీళ్లు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. జగన్కు బుద్ధిలేదు కాబట్టే పట్టిసీమను వ్యతిరేకించరి ఆరోపించారు. చప్పట్లు కొట్టడం మానేసి ప్రజలంతా చంద్రబాబుకు మద్దతు తెలపాలన్నారు.
మరోసారి(2019) తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణమవుతుందని దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి చేయడంలో చంద్రబాబును మించిన వారులేరని ప్రశంసించారు. చంద్రబాబు సామర్థ్యం చూసే తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు జేసీ తెలిపారు. పట్టిసీమను వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి అవగాహనరాహిత్యమని ధ్వజమెత్తారు.