పదవి శాశ్వతంకాదు: కిరణ్, సిఎం సాహసం: లేఖపై జెసి
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని, తాను ఉండగా రాష్ట్ర విభజన జరగరాదన్నదే తన అభిమతమని అందుకే రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశానని కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు నేత జెసి దివాకర్ రెడ్డితో వ్యాఖ్యానించారట. కిరణ్ను శనివారం జెసి కలిశారు.
ఈ సందర్భంగా జెసి లేఖలు రాసినందుకు ముఖ్యమంత్రికి కితాబిచ్చారు. దానికి కిరణ్ స్పందిస్తూ... లేఖలపై అధిష్ఠానం ఏమనుకుంటుందోనని ఆలోచించడం లేదని, విభజన వల్ల కష్టనష్టాలను వివరించడంతోపాటు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరడం తన బాధ్యత అన్నారు.
అందుకు జెసి.. ఇంటికి వెళ్లిపోవాలనుకుంటున్నారా, ఘాటైన లేఖలు రాశారు అని కిరణ్తో అన్నారట. దానికి కిరణ్ పైవిధంగా ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదని వ్యాఖ్యానించారట.
ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం జెసి మాట్లాడుతూ... రాష్ట్ర సమైక్యత కోసం కిరణ్ సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారని, దేశంలో ముఖ్యమంత్రిగా ఉన్నవారెవరూ ఇంతటి సాహసం చేయలేదని, ఇలా లేఖలు రాయడం పార్టీ ధిక్కారం కాదని, తొమ్మిది కోట్ల ప్రజల కోసం ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారన్నారు.
తన వ్యక్తిగత అంశాన్ని మాట్లాడడం లేదని, న్యాయంగా, ధర్మంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారని జెసి చెప్పారు. అది తెగింపునకు సిద్ధమని తాను అననని కానీ, ధైర్యంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పారన్నారు. కిరణ్పై అధిష్ఠానం కొరడా ఝళిపించలేదని ఎందుకంటే, రాజ్యాంగ ప్రక్రియను మాత్రమే ఆయన వివరించారని, దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారని చెప్పారు.