ఎపికి ప్రత్యేక హోదాపై జైట్లీని నిలదీసిన జెసి దివాకర్ రెడ్డి
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి ఇచ్చిన హామీ ఏమైందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడుజెసి దివాకర్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలోని సోమందేవ్ పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, అశోకగజపతి రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జేసీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి తనదైన శైలిలో ఆవేశంగా ప్రశ్నలు సంధిస్తూ, కొన్ని విన్నపాలు కూడా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే వెనుకబడిన అనంతపురం జిల్లాను ప్రత్యేకంగా ఆదుకోవాలని కోరారు.
పన్ను రాయితీలతో పాటు కరువు నుంచి జిల్లాను గట్టెక్కించేందుకు చొరవ తీసుకోవాలని జేసీ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాయలసీమకు నీళ్లిచ్చేందుకు సీఎం చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని, ఆయనకు కేంద్రం కూడా తోడ్పాటునందించాలని కోరారు.
దేశంలోనే రెండో అత్యంత కరువు జిల్లా అనంతపురం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలో నేషనల్ కస్టమ్స్ అకాడమీకి చంద్రబాబు శంకుస్థాన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లా అభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఆయన కోరారు.
సాగునీరు, పరిశ్రమలు వస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందని బాబు తెలిపారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయడం ద్వారా రాయలసీమకు నీరు అందిస్తామని ఆయన చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రాయలసీమకు సాగునీరు అందిస్తామని బాబు పేర్కొన్నారు.
హంద్రీనీవాకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని, తుంగభద్ర హైలెవల్ కెనాల్ను ఆధునీకరిస్తామని తెలిపారు. కేంద్రం చివరిదశలో చేసిన సాయంతో కొంత గట్టెక్కామని చంద్రబాబు అన్నారు. కేంద్రం సహకరిస్తేనే ఏపీ అభివృద్ధి చెందుతుందన్నారు.
పారిశ్రామిక రాయితీలు ఇస్తే పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. డ్వాక్రా రుణాలమాఫీ హామీని త్వరలో నెరవేరుస్తామన్నారు. చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. త్వరలో జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.