చంద్రబాబు-కేసీఆర్ మధ్య పోలికా..? : జేసీ, పిచ్చిగా వాగొద్దు : ముద్రగడకు నారాయణ వార్నింగ్
హైదరాబాద్ : రాజకీయాల్లో సమవుజ్జీలన్నాక నేతల మధ్య పోలిక కామన్ గానే ఉంటుంది. పనితీరులోను వ్యవహారశైలి లొను ప్రతిదానికి లెక్కలతో సహా బేరిజు వేయడం సాధారణమైన విషయమే. తాజాగా ఇదే విషయంపై స్పందించిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ మధ్యన పోలిక తీసుకురావడం అనవసరమన్నారు.
మంగళవారం ఉదయం అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడిన జేసీ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సీట్ల సర్దుబాటుపై స్పందిస్తూ.. ఈ విషయంలో చంద్రబాబు ఎంపిక సరైనదే అని చెప్పుకొచ్చారు. అలాగే మీడియా ప్రతినిథులు విశాఖ రైల్వే జోన్ గురించి ప్రస్తావించగా, దానిపై మాట్లాడేందుకు ఇది సందర్భం కాదని చెప్పిన ఆయన విశాఖ రైల్వే జోన్ నిర్ణయం ప్రధాని చేతుల్లోనే ఉందన్నారు.
ఇక టీడీపీ తరుపున సురేష్ ప్రభుకి అవకాశం ఇవ్వడం గురించి కూడా స్పందించిన జేసీ, సురేష్ ప్రభు మంచి వ్యక్తి అని, ఆయన పనితీరు బాగుంటుందని ప్రశంసించారు.
పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు : ముద్రగడకు నారాయణ వార్నింగ్
నెల్లూరు: కాపు రిజర్వేషన్ల అంశం కాపు నాయకుడు ముద్రగడకు, అధికార పక్షం టీడీపీకి మధ్య మాటల యుద్దానికి దారి తీస్తోంది. తాజాగా ముద్రగడ పోకడలపై విరుచుకుపడ్డ టీడీపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, నారాయణ, ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.
బతుకుదెరువు కోసం టీడీపీ మంత్రులు చెక్క భజన చేస్తున్నారన్న ముద్రగడ ఆరోపణలను తిప్పికొడుతూ తనకు మద్దతు కూడగట్టుకోవడం కోసం ప్రతిపక్ష నేతల చుట్టూ తిరుగుతున్న ముద్రగడే వారికి చెక్కభజన చేస్తున్నారని విమర్శించారు డిప్యూటీ సీఎం చినరాజప్ప.
సర్వే నిమిత్తం మంజునాథ కమిషన్ రాష్ట్రంలో పర్యటించబోతుందని ప్రకటించిన ఆయన జూన్ 1 నుంచి 30 వ తేదీ వరకు కాపులను బీసీలలో చేర్చే విషయమై రాష్ట్రమంతటా సర్వే నిర్వహిస్తుందన్నారు.
ఇక పురపాలక మంత్రి నారాయణ మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం మంత్రులు చెక్క భజన చేస్తున్నారని ముద్రగడ చేసిన వ్యాఖ్యలు శోచనీయమన్నారు. ఎవరిది చెక్క భజనో ప్రజలందరికీ తెలుసునని, రాజకీయ ప్రయోజనాల కోసం పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని ముద్రగడను హెచ్చరించారు.
ముద్రగడ చేసిన వ్యాఖ్యలకు తక్షణం సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబుపై కాపులకు విశ్వాసం ఉందని చెప్పిన ఆయన కమిషన్ నుంచి నివేదిక రాగానే, కాపులను బీసీలో చేర్చే ప్రక్రియ మొదలవుతుందన్నారు.
పాలకొల్లు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మల రామానాయుడు కూడా ముద్రగడపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్చారు. మీ ఇష్టానుసారం ఉపయోగించుకోవడానికి కాపుల మీద మీకేమైనా కాపీరైట్ ఉందా.. అని ప్రశ్నించారు. దశాబ్దాల తరబడి కాపు ప్రయోజనాల కోసం పనిచేస్తున్న సంఘాలు మీ కంటికి ఎందుకు కనపడట్లేదని నిలదీశారు.
లక్ష మంది కాపులతో ఆందోళనలు చేపడుతామని పదే పదే ప్రకటించడం ఇతర కులాల్లో కాపు జాతి పట్ల సఖ్యతను సహనాన్ని దెబ్బతీయడమనేనని మండిపడ్డారు. ఇలాంటి అసహనం వల్లే ఇంతకుముందు మీరు ఓడిపోయిన విషయం మర్చిపోయారా.. అని ముద్రగడకు గుర్తు చేశారు.
ఎస్సీ, బీసీ కులాల్లో కాపులపై స్నేహం, ప్రేమ ఉంది. దానిని విచ్ఛిన్నం చేయడానికే మీరు ప్రయత్నిస్తున్నట్టుంది, రహస్య ఎజెండా పెట్టుకుని కాపులకు ఏనాడూ మేలు చేయని నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారుని ఆరోపించారు.
దీనిపై స్పందించిన మరో టీడీపీ ఎమ్యెల్యే జీవీ ఆంజనేయులు వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని రాబందుతో పోల్చారు. జగన్ శవరాజకీయాలు చేస్తూ రాబందు తరహా వ్యవహారం నడిపిస్తున్నారని విమర్శించారు.
జగన్ కాపు వ్యతిరేకుడు : కాపు కార్పొరేషన్ చైర్మన్
విజయవాడ : జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాపు జాతి వ్యతిరేకులని మండిపడ్డారు కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ.పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్లు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి ప్రపంచమంతా అవినీతిమయంగానే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సోమవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు రామానుజయ.