చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం: మంత్రి ఉషశ్రీపై జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు
అనంతపురం: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి తాజా మంత్రి ఉషశ్రీచరణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన ఓ ర్యాలీలో జేసీ ప్రభాకర్ రెడ్డి మంత్రి ఉషశ్రీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేసులకు భయపడేది లేదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి
ఓ చిన్నారి మృతిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడే వాళ్లపై రౌడీషీటర్ కేసు నమోదు చేస్తే.. భయపడేది లేదన్నారు. అంతేగాక, తాడిపత్రిలో మంత్రి ఉషశ్రీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కళ్యాణదుర్గంలో చిన్నారి మృతి విషయంలో న్యాయ విచారణ జరిపించాలని ప్రకాశ్ నాయుడు నిరసన తెలిపితే అతనిపై రౌడీషీట్ తెరుస్తారా? అని ప్రశ్నించారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని కార్యకర్తల్లో నింపేలా మరింత పనిచేస్తామని తేల్చిచెప్పారు.
గతంలో ఏ పార్టీలో ఉన్నావు..? శవరాజకీయాలు చేసింది జగన్ కాదా?: జేసీ
ఇక గతంలో మంత్రి ఉషశ్రీ ఏ పార్టీలో ఉన్నారో గుర్తు చేసుకోవాలన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఉషశ్రీపై కర్ణాటక లోకాయుక్తా, సుప్రీంకోర్టు కేసుల విషయం చెప్పమంటారా? అని ప్రశ్నించారు. మంత్రి ఉషశ్రీ కంటే గట్టిగానే తాను విమర్శలు చేయగలనని అన్నారు. మొత్తం చెప్పగలను కానీ, మహిళ కనుక అన్ని విషయాలు చెప్పడం లేదని జేసీ వ్యాఖ్యానించారు. తండ్రి చనిపోతే మూడేళ్లు శవరాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఉషశ్రీ తనపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం: జేసీ ప్రభాకర్ రెడ్డి
చనిపోయిన పాప తండ్రి వికలాంగుడని.. మానవత్వంతో స్పందించి ఆ కుటుంబానికి పెన్షన్ ఇప్పించాలని మంత్రి ఉషశ్రీకి సూచించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అంతేగాక, మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సంక్షేమం కోసం ఎన్జీవో ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కాగా, చిన్నారి మృతి విషయంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీనిపై నారా లోకేష్ స్పందిస్తూ.. తనపై ఇక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తారా? అని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.