TTD: ఇక కొండ కిందే పార్కింగ్..వసతి - విశాఖ, విజయవాడల్లో దర్శన టోకెన్లు..!!
TTD భక్తుల సదుపాయాల పైన కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అవసరమైన మార్పులు చేస్తోంది. వేసవి రద్దీ వేళ సామాన్య భక్తులకు ఇబ్బంది లేని విధంగా కార్యాచరణ కొనసాగిస్తోంది. ఇదే సమయంలో శ్రీవాణీ టికెట్లు ఇక లక్కీ డీప్ విధానంలో అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. తిరుమల కొండ పైన వాహనాల రద్దీ నివారణ కోసం కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. బ్రేక్ దర్శనాల్లో కోత విధించి.. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.
టీటీడీ శ్రీవాణి టికెట్ల విషయంలో టీటీడీ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతోంది. ఆన్ లైన్ లో శ్రీవాణి టికెట్ల జారీ విధానంలో జరుగుతున్న అక్రమాలను నిరోధించేందుకు ఈ టికెట్ల జారీ గరిష్టం గా 1500 దాటకుండా చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో విజయవాడ, విశాఖ తో పాటుగా రాజమండ్రి విమానాశ్రయాల నుంచి శ్రీవాణీ కోటా జరీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్య అధికారులు వెల్లడించారు. ఇక.. తిరుమలలో ప్రస్తుతం వాహనాల రద్దీ కారణంగా కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో, కొత్త ప్రతిపాదనల మేరకు కొండ కిందే పార్కింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఇందు కోసం జూ పార్క్ రోడ్డులో సుమారు 300 ఎకరాల అటవీ స్థలం ఉండటం తో వారికి టీటీడీ భూములు కేటాయించి.. ఆ స్థలంలో మెగా పార్కింగ్, వసతి, స్కానింగ్ హబ్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారు. అక్కడి నుంచి విద్యుత్ బస్సుల్లో తిరుమలకు వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి.

శ్రీవాణి టికెట్ల పై టీటీడీ క్లారిటీ
కాగా, శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో భక్తులు అపోహల కు గురికావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అందులోని లోటుపాట్లను మరియు భక్తుల నుండి వచ్చిన సూచనలు, సలహాల మేరకు 2024 సంవత్సరం జూన్ నుండి భక్తులకు పారదర్శకంగా, సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించడం జరిగిందని వెల్లడించింది. శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్ను హ్యాక్ చేయడం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని స్పష్టం చేసింది. భక్తులు అపోహలకు గురి కావద్దు. అయితే కొందరు దళారులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని వివరించింది. ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలను టీటీడీ సాంకేతిక విభాగం ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత ఐడీలు మరియు అక్రమ బుకింగ్ విధానాలను వెంటనే నిరోధించి తదనుగుణంగా సాప్ట్ వేర్ ను కూడా ఎప్పటిక ప్పుడు అప్డేట్ చేస్తూ నిరంతర నిఘా ఉంచడం జరుగుతోందని వెల్లడించారు.













Click it and Unblock the Notifications