హైదరాబాద్లో ‘ట్రంప్ రోడ్డు’ రగడ!
హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న అమెరికా కాన్సులేట్ సమీపంలోని రహదారికి "డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ" అని పేరు పెట్టడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి.. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులకు అస్సలు పొంతన లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు.
అమెరికా స్వాతంత్య్రం వచ్చి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్లో నిర్వహించిన ఓ ప్రత్యేక వేడుకలో ఈ రహదారి పేరు మార్పునకు సంబంధించిన ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారత పర్యటనలో ఉన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ రోడ్డు ప్రారంభోత్సవానికి ఒక రోజు ముందే బీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓ బహిరంగ లేఖ రాశారు.

జాతీయ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా విమర్శించే కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో మాత్రం ఆయన పేరుతో రోడ్డును ఎలా ప్రారంభిస్తుందని శ్రవణ్ కుమార్ ప్రశ్నించారు. "ఢిల్లీలో సార్వభౌమాధికారం గురించి మాట్లాడే కాంగ్రెస్.. హైదరాబాద్లో మాత్రం ఇలాంటి నాటకాలకు తెరలేపింది. అసలు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ జాతీయ సిద్ధాంతాలను పక్కనబెట్టి ప్రైవేట్ ఫ్రాంచైజీ రాజకీయం చేస్తోందా?" అని దాసోజు శ్రవణ్ కుమార్ నిలదీశారు. ఢిల్లీలోని కేంద్ర నాయకత్వానికి, హైదరాబాద్లోని రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉన్న ఈ అంతరం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి ఒకే విధమైన సిద్ధాంతాలు ఉన్నాయా లేదా రాష్ట్రానికో విలువలని మార్చేస్తూ రాజకీయ అవకాశవాదానికి పాల్పడుతోందా? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని విమర్శించారు.
ఇటీవలే జూన్ 20న ఏఐసీసీ జాతీయ ప్రతినిధి పవన్ ఖేరా విడుదల చేసిన ఓ ప్రకటనను ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ గుర్తు చేశారు. డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ఇండియాను తక్కువ చేసి చూస్తోందని, నిరంతరం అవమానిస్తోందని, భాగస్వామిగా కాకుండా ఆజ్ఞాపించే భాషలో మాట్లాడుతోందని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా విమర్శించిందని ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అటువంటి కఠినమైన ప్రకటనలు చేస్తూ.. క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని స్పష్టం చేస్తోందని ఆరోపించారు.
ఈ వివాదంపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ వివాదాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశారు. అమెరికా కాన్సులేట్లో జరిగిన 250 ఏళ్ల వేడుకల కార్యక్రమానికి తాను హాజరయ్యానని, అయితే ఈ రోడ్డుకు పేరు పెట్టే విషయంపై తనకు పూర్తి అవగాహన లేదని అన్నారు. ఒకవేళ అలా పేరు పెట్టినా అందులో తప్పేముందని, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడే కానీ ఏమీ నేరస్థుడు కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయంపై త్వరలోనే ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇస్తుందని మంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications