పాదయాత్రకు సిద్ధమైన అంబటి.. పోలీస్ శాఖపై సంచలన ఆరోపణలు
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజును కాపాడేందుకే 'సిట్' విచారణ జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన ఘోర లాకప్ డెత్ నిజాలు బయటకు రావాలంటే వెంటనే ఈ కేసును సీబీఐ (CBI) కి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. తన అక్రమ అరెస్టుకు నిరసనగా, తన ఇంటిపై దాడి చేసిన వారిని శిక్షించాలని కోరుతూ జూలై 29వ తేదీన గుంటూరు నుంచి మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం వరకు రెండు రోజుల పాటు "వినతి పాదయాత్ర" చేపట్టనున్నట్లు అంబటి రాంబాబు సంచలన ప్రకటన చేశారు.
గుంటూరులో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. నిందితుడు సీఐ నాగరాజును కాపాడటమే లక్ష్యంగా సిట్ దర్యాప్తు సాగుతోందని మండిపడ్డారు. ఎక్కడెక్కడ సాక్ష్యాలు ఉన్నాయో తెలుసుకుని, వాటిని మాయం చేయడానికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఉందని ధ్వజమెత్తారు. "ఈనెల 19న సీఐ నాగరాజుపై కేసు నమోదైతే.. 23వ తేదీ వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆ ఐదు రోజులు సీఐతో పోలీసులు బేరసారాలు సాగించారు. నిన్ను రక్షిస్తామంటూ గట్టి హామీ ఇచ్చి ఒప్పించిన తర్వాతే నామమాత్రంగా అరెస్ట్ డ్రామా ఆడారు" అని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీసీ ఫుటేజ్ మాయంపై ఐపీఎస్ అధికారులు సిగ్గుపడాలి!
పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీలను 18 నెలల పాటు భద్రపరచాలన్న సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, ఏడాది కిందటి వరకు ఫుటేజ్లను మాయం చేయడంపై అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా సిట్ ఏర్పాటైన తర్వాతే కృష్ణలంక పీఎస్లో సీసీ ఫుటేజ్ గాయబ్ అయిందని ఆరోపించారు. "ఏడాది కాలంగా కృష్ణలంక పీఎస్లో ఇంకెన్ని ఘోరాలు చేసి ఉంటే అంత ఫుటేజ్ డిలీట్ చేస్తారు? ఈ ఫుటేజ్ల మాయంపై సిట్లో ఉన్న ఐపీఎస్ అధికారులు సిగ్గుపడాలి" అని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిగిస్తేనే అటు సీపీ పాత్రతో పాటు, సదరు సీఐ రూ. 100 కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టాడో అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు.
పవన్ కళ్యాణ్ ఇంతలా దిగజారుతాడనుకోలేదు!
ఈ కేసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరును అంబటి తీవ్రంగా తప్పుపట్టారు. " సామినేని ఉదయభానుతో సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని పరామర్శింపజేసి.. మరోవైపు జనసైనికులతో సీఐ నాగరాజు అరెస్టుకు వ్యతిరేకంగా ధర్నాలు చేయించడం ఏంటి? పవన్ కళ్యాణ్ ఇంతలా దిగజారిపోతాడని అనుకోలేదు. సిట్ను సర్వనాశనం చేసి సీఐని కాపాడటానికి పవన్ ప్రయత్నిస్తున్నాడు" అని విమర్శించారు. తాము సాయికృష్ణ అనే క్రిమినల్కు సపోర్ట్ చేయడం లేదని, ఒక నిండు ప్రాణాన్ని లాకప్లో చిత్రహింసలు పెట్టి తీశారు కాబట్టే మానవత్వంతో వైయస్సార్సీపీ పోరాడుతోందని స్పష్టం చేశారు. పూర్తిగా నిర్వీర్యమైపోయిన పోలీస్ వ్యవస్థను బతికించుకోవడం ఇప్పుడు సమాజం ముందున్న పెద్ద సవాల్ అని ఆవేదన వ్యక్తం చేశారు.
జూలై 29న "వినతి పాదయాత్ర"
తనను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులపై న్యాయపోరాటం ఆపేది లేదని, ఇప్పటికే కోర్టు వారికి నోటీసులు జారీ చేసిందని అంబటి రాంబాబు తెలిపారు. దీనికి నిరసనగా జూలై 29న గుంటూరులోని తన నివాసం నుంచి మంగళగిరి డీజీపీ ఆఫీస్ వరకు రెండు రోజుల పాటు "వినతి పాదయాత్ర" చేపడతానని, స్వయంగా డీజీపీని కలిసి తన ఇంటిపై దాడి చేసిన వారిని శిక్షించాలని వినతిపత్రం అందజేస్తానని వెల్లడించారు.














Click it and Unblock the Notifications