అశోకుడి కాలం నాటి బంగారం, ఎర్రగుడి శాసనాలు సాక్షిగా జొన్నగిరి: సీఎం
బంగారు గనుల వేట అనగానే దేశంలో ఇప్పటివరకూ కర్నాటకలోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) పేరే గుర్తొచ్చేది. కానీ, ఇకపై ఆ రికార్డులను తిరగరాస్తూ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగనుంది. ఒకప్పుడు కరవు కేకలతో అల్లాడిన కర్నూలు జిల్లా.. ఇప్పుడు దేశంలోనే ప్రైవేట్ రంగంలోనే అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు ప్రధాన వేదికగా అవతరించింది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక 'జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టు'ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్కు కూడా సీఎం శంకుస్థాపన చేయడం విశేషం.
జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు రూ.405 కోట్ల భారీ పెట్టుబడితో ఈ సువర్ణ సామ్రాజ్యాన్ని నెలకొల్పాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఏకంగా 1,500 ఎకరాల భూమిని కేటాయించగా, మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు సిద్ధమయ్యాయి. పసిడి వెలికితీతలో ఈ ప్లాంట్ సంచలనాలు సృష్టించబోతోంది. తొలి ఏడాది 400 కేజీల పసిడి ఉత్పత్తితో ప్రారంభమై.. వచ్చే ఏడాది నాటికి 900 కేజీలు, ఆ తర్వాతి దశలో ఏటా ఏకంగా 2 టన్నుల మేర బంగారాన్ని వెలికితీసేలా ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని భారీగా విస్తరించనున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నీటి కోసం హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా 18 కిలోమీటర్ల మేర ప్రత్యేక పైపులైన్ వేసి, 0.021 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు.

ఖజానాకు కాసుల వర్షం.. రాయలసీమ యువతకు ఉపాధి!
జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కేవలం బంగారం తీయడమే కాదు.. రాయలసీమ రూపురేఖలను మార్చేయబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 700 మందికి పైగా ఉపాధి లభించనుంది. ముఖ్యంగా, మైనింగ్ ప్రాంతంలో తిరిగే భారీ వాహనాలను నడిపేందుకు వీలుగా ఇక్కడి మహిళలకు, యువతకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'సిమ్యులేటర్ యంత్రాల శిక్షణా కేంద్రాన్ని' సీఎం చంద్రబాబు సందర్శించి అభినందించారు. అనంతరం ఆయన జెండా ఊపి ఖనిజంతో కూడిన మట్టిని తరలించే భారీ మైనింగ్ వాహనాలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరనుంది. ఉత్పత్తి అయ్యే బంగారం విలువలో 4 శాతం రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి దక్కుతుంది. దీని ద్వారా మొదటి ఏడాది తీసే 400 కేజీలకు రూ.57 కోట్లు, ఆ తర్వాత 900 కేజీల ఉత్పత్తిపై రూ.144 కోట్ల చొప్పున ప్రభుత్వానికి రాయల్టీ ఆదాయం రానుంది.
ముడి ఖనిజం నుంచి గోల్డ్ బిస్కెట్ దాకా.. స్వయంగా పరిశీలించిన సీఎం
ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మైనింగ్ క్షేత్రంలో తవ్వకాలు జరిపి, ముడి ఖనిజం నుండి నిగనిగలాడే మేలిమి బంగారాన్ని ఉత్పత్తి చేసే ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ప్లాంట్లోని వేర్వేరు విభాగాలను విజిట్ చేసిన సీఎం.. తుది ఉత్పత్తిగా వచ్చిన 'బంగారు బిస్కెట్లు' సహా వివిధ రూపాల్లో ఉన్న పసిడిని ఆసక్తిగా చూశారు. గనిలో మైనింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కరిగించి గోల్డ్ బిస్కెట్ తయారుచేసే వరకు జరిగే ప్రతి దశను జియో మైసూర్ సంస్థ చైర్మన్ ప్రభాకరన్, ఎండీ నవీన్ లాల్ చంద్ర ముఖ్యమంత్రికి వివరంగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ సహా పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇకపై దేశంలో గోల్డ్ మైనింగ్ అనగానే 'జొన్నగిరి' పేరే బ్రాండ్ కాబోతోందని ఈ సందర్భంగా అధికారులు ధీమా వ్యక్తం చేశారు.
నాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి
ఈ రోజు రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని.. ఆ సువర్ణ అధ్యాయానికి రతనాల సీమ రాయలసీమ కేంద్రమైందని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించుకోవడం శుభపరిణామన్నారు.
జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు అశోకుడి నాలుగు రాజధానుల్లో సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండింది. ఇక్కడకు దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చెబుతున్నాయి. రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో సీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచానికి కోహినూర్ వజ్రాన్ని అందించిన ఘనత మన రాష్ట్రానిదే. కాలక్రమేనా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు తలెత్తాయి. ప్రాజెక్టులు పూర్తి చేసి, సాగునీరు ఇచ్చి సీమకు మళ్లీ జీవం పోశాం. గోల్డ్ మైనింగ్ తో సీమకు పూర్వ వైభవం వస్తుంది. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టుపై రూ.405 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. జొన్నగిరి బదులు ఈ ప్రాంతానికి మళ్లీ స్వర్ణగిరి అని పేరు పెట్టుకుందాం. 2047కు దేశాన్ని వికసిత్ భారత్ గా తయారు చేయాలన్నది ప్రధాని మోదీ కల. మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తయారు చేయాలన్నది నా ఆలోచన నిన్నటి వరకూ జొన్నగిరిగా ఉన్న ఈ ప్రాంతం పేరును ఇక నుంచి స్వర్ణగిరిగా మార్చుకుందాం. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది. ఇక్కడి ప్రజల జీవితాలు కూడా స్వర్ణమయం కావాలని ఆకాంక్షిస్తున్నాను, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని స్వర్ణగిరి మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేస్తారు. రాయలసీమను రతనాల సీమగా తయారు చేస్తామని చెప్పిన మాటను నెరవేర్చుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ మాత్రమే కాదు...ఆంధ్రప్రదేశ్ అంటే రత్నగర్భ కూడా. మన రాష్ట్రంలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు - సీఎం చంద్రబాబు నాయుడు.
కర్నూలు జిల్లా జొన్నగిరిలో తవ్వకాలు జరిపి, ముడి ఖనిజం నుంచి బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఉత్పత్తి యూనిట్లోని వేర్వేరు విభాగాలను సందర్శించిన సీఎం.. బంగారం బిస్కట్లతో పాటు వివిధ రూపాల్లో ఉన్న తుది ఉత్పత్తులను పరిశీలించారు. #JonnagiriGoldFields… pic.twitter.com/TnGBQVPHI4
— Telugu Desam Party (@JaiTDP) June 24, 2026














Click it and Unblock the Notifications