ఆకట్టుకున్న జేసీ: జగన్ పార్టీ నేత పేరంతో విందు, నవ్వులు!
టిడిపి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత పేరం నాగిరెడ్డితో కలిసి విందు భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.
అనంతపురం: జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ ఏం మాట్లాడినా, ఏం చేసినా సంచలనమే అవుతుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, జేసీ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి వార్తల్లో నిలిచారు. ఎందుకంటే.. ప్రత్యర్థి పార్టీ అయిన వైయస్సార్ కాంగ్రెస్ నేత పేరం నాగిరెడ్డితో కలిసి విందుభోజనం చేశారు. అంతేగాక, వారి మాటల మధ్యలో నవ్వులు పూయడంతో మిగితావారంతా ఆశ్చర్యంతో ఆసక్తిగా వారిని గమనించారు.
వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి సమీపంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన ఓ వివాహ నిశ్చితార్థ వేడుకకు జేసీ ప్రభాకర్ రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ నేత పేరం నాగిరెడ్డి హాజరయ్యారు.
ముందుగా పేరం నాగిరెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. దీంతో టీడీపీ మద్దతుదారులు పలువురు ఆయనను పలకరించారు. ఆయనతో కలిసి మాట్లాడిన వారిలో టౌన్బ్యాంకు అధ్యక్షుడు దద్దం సుబ్బరాయుడు, మాజీ వక్ఫ్బోర్డు అధ్యక్షుడు సలాం, అకులచందు తదితరులున్నారు.

కొద్దిసేపటి తరువాత టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి కూడా వచ్చారు. ఆ సమయంలో టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న పేరం నాగిరెడ్డిని చూసి భోజనానికి తన వద్దకు రావాల్సిందిగా మద్దతుదారులకు చెప్పి పంపారు. దీంతో ఎమ్మెల్యే జేసీ పిలుస్తున్నారంటూ వారు వచ్చి చెప్పడంతో భోజనం చేయడానికి ఆయన వెళ్లారు.
ఆ తర్వాత జేసీతో కలిసి భోజనం చేశారు. కాగా, తాము ఓకే చోట కూర్చుని భోజనం చేయడంపై అక్కడున్న వారితోపాటు తన అనుచరులు అశ్చర్యంగా చూడడాన్ని కనిపెట్టిన ఎమ్మెల్యే జేసీ.. తనకు, పేరం నాగిరెడ్డికి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పుకొచ్చారు.
పేరం నాగిరెడ్డి అంటే తనకు ఎంతో అభిమానం ఉందన్నారు. కాగా, ఆయన మాట్లాడుతున్నప్పుడు పేరం నవ్వుతూ కనిపించారు. చికెన్ వడ్డించడానికి పేరం ప్రయత్నించగా ప్రస్తుతం తాను చికెన్ తినడం లేదని జేసీ చెప్పారు. అలాగే పేరం నాగిరెడ్డికి కూడా మాంసాహారం వడ్డించడానికి అక్కడున్నవారు ప్రయత్నించగా ఆయన కూడా మాంసాహారం పెద్దగా తినరని జేసీ చెప్పడం గమనార్హం. కాగా, ప్రత్యర్థి పార్టీల నేతలు ఇలా కలిసి విందులో పాల్గొనడం అక్కడున్నవారిని ఆకట్టుకుంది.












Click it and Unblock the Notifications