జేసీ ప్రభాకర్: ‘ఆయన ఇంట్లో బీరువా లేదూ! బీగమూ లేదు!’
అనంతపురం: ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ఉండే తెలుగుదేశం పార్లమెంటుసభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తన ఇంట్లో బీరువా, బీగమూ కూడా లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తనకు కనిపించినవారందరి దగ్గర చెబుతుండటం గమనార్హం.
డబ్బు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు బీరువాలను ఏర్పాటు చేసుకుంటారని, తన ఇంట్లో అలాంటిది ఎక్కడా కనిపించదని చెబుతున్నారు. ఈ నేపథ్ంయలో జేసీ ప్రభాకర్ రెడ్డికి కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులున్నాయని, ఫ్యాక్టరీలు, ట్రాన్స్పోర్టు కంపెనీలు ఇలా చాలా వ్యాపారులున్నాయని విపక్ష నేతలు తరచూ ఆరోపిస్తుండటం జరుగుతోంది.
అంతేగాక, దక్షిణాఫ్రికాలో మైన్స్, పవర్ ప్రాజెక్టులు ఉన్న ఇంత పెద్ద ఆసామి బీరువా, బీగాలు లేవని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటారు విపక్ష నేతలు ఎద్దేవా చేస్తుంటారు కూడా. అయినా, ప్రస్తుత కాలంలో బీరువా, బీగాలతో అవసరం ఏముందని, బ్యాంకుల్లో డబ్బు దాచేసుకుని.. జేబులో ఏటీఎం కార్డు పెట్టుకుంటే సరిపోతుందని వ్యాఖ్యానిస్తుంటారు.
అయితే, ప్రతిపక్షాల మాటలను మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్యేగా తనకు వచ్చిన రెండేళ్ల జీతంతో భార్య పిల్లలకు కానుకలు కొన్నానని, మునిసిపాలిటీలోని అనాథ పిల్లలకు భోజనాలు పెట్టిస్తున్నానని జేసీ ప్రభాకర్ చెప్పుకొస్తున్నారు.

కాగా, మునిసిపాలిటీ అభివృద్ధి కోసం అనేక ఆర్ధిక సంస్కరణలను తీసుకొచ్చారని జేసీ ప్రభాకర్ రెడ్డికి మంచి పేరే ఉంది. తాడిపత్రిలో వేస్ట్ వాటర్ను కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. మొక్కలు పెంచి పచ్చదనానికి బాటలు వేశారని అంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడా మొక్కల పెంపకంలో తాడిపత్రిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారట.
అంతేగాక, రాష్ర్టంలో ఇతర మునిసిపాలిటీలు అప్పుల్లో ఉంటే తాడిపత్రిలో మాత్రం పాతిక కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉందట. ఈ క్రమంలో ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గ వాసులు మాత్రం అభిమానంతో జేసీపీఆర్ అని పిలుచుకుంటున్నారు. గిట్టనివారు మాత్రం జేసీబీ అని సంబోధిస్తుంటారట. ఏదేమైనా ప్రభాకర్ రెడ్డి తన ఇంట్లో బీరువా, బీగము లేదన్న విషయం ఆయనకే తెలియాలి మరి.












Click it and Unblock the Notifications