తమిళనాడు గవర్నర్ కు విజయ్ బిగ్ ట్విస్ట్..! మైనార్టీ ప్రభుత్వమే ?
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల్ని మట్టి కరిపించి అనూహ్య విజయం అందుకున్న టీవీకే అధినేత విజయ్ (vijay) ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమవుతున్నారు. ఈ మేరకు గవర్నర్ ఆహ్వానం మేరకు ఇవాళ లోక్ భవన్ కు వెళ్లిన విజయ్.. ఆయనకు ట్విస్ట్ ఇచ్చారు. ఎన్నికల్లో తాము గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మాత్రమే కలిపి తమకు మద్దతిస్తున్న 112 మంది జాబితాను సమర్పించారు. దీంతో మైనార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కావాల్సిన సాధారణ మెజార్టీ మార్కు 118 సీట్లు. అయితే విజయ్ పార్టీ టీవీకే 107 సీట్లు మాత్రమే గెల్చుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 10 సీట్లను సమకూర్చుకునే విషయంలో విజయ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీని మాత్రమే విజయ్ సంప్రదించారు. దీంతో వీరికి కాంగ్రెస్ 5 సీట్ల మద్దతు లభించింది. అనంతరం కమ్యూనిస్టుల్ని కూడా మద్దతివ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా వారి నుంచి సమాధానం రాలేదు. దీంతో కాంగ్రెస్ తో కలుపుకుని టీవీకేకు ఉన్న 112 సీట్లతోనే ప్రభుత్వ ఏర్పాటు చేస్తామంటూ తెలిపారు.

కేబినెట్ ప్రమాణ స్వీకారం తర్వాత రెండు వారాల సమయం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్.. గవర్నర్ అర్లేకర్ కు తెలిపారు. దీంతో ఆయన కూడా అందుకు అంగీకరించి ప్రభుత్వ ఏర్పాట్లు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ పార్టీ ముందు కేబినెట్ ప్రమాణ స్వీకారంపై ఫోకస్ పెట్టబోతోంది. అనంతరం మిగతా పార్టీలతో సంప్రదింపులు జరిపి సభలో బలపరీక్ష నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాడులో ముందుగా మైనార్టీ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతోంది.














Click it and Unblock the Notifications