సోనియా తప్పుకుని, కొత్తవారికి చాన్స్ ఇవ్వాలి: జెసి
అనంతపురం: కాంగ్రెసు రాయలసీమ సీనియర్ శానససభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేసి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో కాంగ్రెసు పనైపోయిందని, గోవిందా.. గోవిందా అని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును ఆపడానికి ప్రయత్నిస్తూ అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకాలు చేసిన పార్లమెంటు సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తాను పార్టీ మారాల్సిన అవసరం లేదని, కొత్త పార్టీ వస్తే ఆలోచన చేస్తానని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉందని, తెలంగాణ బిల్లు ఆగిపోయే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సోనియా తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. నాలుగు మాసాల నుంచి తాను కాంగ్రెసు ఉండదని చెబతూనే ఉన్నానని ఆయన అన్నారు.

సోనియా తన ఆరోగ్యం దృష్ట్యా, ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా విశ్రాంతి తీసుకుంటే మంచిదని ఆయన అన్నారు. రాహుల్కు అవకాశం వస్తుందా, మరొకరికి అవకాశం వస్తుందా అనేది ప్రశ్న కాదని ఆయన అన్నారు. సోనియా గాంధీ ఎక్కడి నుంచో వచ్చారని, ఇంతకు ముందు బాగా చేశారు గానీ ఇప్పుడు చేయడం లేదని ఆయన అన్నారు.
రాష్ట్రంలో కొత్త పార్టీ రావాల్సిన అవసరం ఉందని జెసి అన్నారు. కొత్త పార్టీ రాకపోతే ఇప్పుడు కాంగ్రెసులో ఉన్నవారు ఎక్కడికి వెళ్లాలని ఆయన అడిగారు. అఖిల భారత స్థాయి పార్టీలకు ఇక అవకాశం లేదని, ప్రాంతీయ పార్టీలు వస్తున్నాయని, ఆ శకం మొదలైందని ఆయన అన్నారు. బిజెపికి కూడా రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉండకపోవచ్చునని ఆయన అన్నారు.
రాహుల్ గానీ ప్రియాంక గాంధీ వస్తే కాంగ్రెసు పార్టీ పరిస్థితి మారుతుందని తాను చెప్పలేను గానీ కాంగ్రెసుకు కొత్త నాయకత్వం రావాలని ఆయన అన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలకు నాయకత్వం అప్పగించాలనే అంశంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications