ఇది- వెన్నుపోటు కాదా?
Vennupotu Dinam: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఘాటు విమర్శలు చేశారు.
ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని, మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆయన ధ్వజమెత్తారు.

చంద్రబాబు మోసాలను ఎండగడుతూ ఈ నెల 4వ తేదీన వెన్నుపోటు దినం పేరుతో నిరసనలు చేపట్టామని, చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ ను జోగి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన 'వెన్నుపోటు దినం' కార్యక్రమం జయప్రదం చేయాలని పార్టీ క్యాడర్, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ, అరాచక విధానాలను పరిచయం చేసిందని, దీనికి నిరసనగా వెన్నుపోటు దినం ఆందోళనలో పాల్గొనాలని కోరారు.
ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా, అడ్డంగా ప్రజలను మోసం చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదని, దాన్ని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్పాతాన్ని సృష్టించిన చరిత్ర కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండరని అన్నారు.
అధికారంలో వచ్చిన తొలిరోజు నుంచే ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుడుతూ, ఏడాదిలోనే 99 శాతం అమలు చేసిన ఘనత వైఎస్ జగన్ సారథ్యంలోని గత తమ ప్రభుత్వానికి దక్కుతుందని జోగి రమేష్ అన్నారు. విప్లవాత్మక వ్యవస్థలను సృష్టించి, ఆచరణలోకి తీసుకువచ్చి, ప్రజలకు సుపరిపాలనను అందించి జగన్ చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
దానికి భిన్నంగా ఆ వ్యవస్థలను విధ్వంసం చేస్తూ, అరాచక పాలనను ఏడాదిలోనే చంద్రబాబు ప్రజలకు చవి చూపించారని జోగి రమేష్ ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎటువంటి దారుణాలకు పాల్పడవచ్చో చంద్రబాబు నిరూపించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం చాలా కష్టమని చంద్రబాబు చెబుతున్నారని, ఇది వెన్నుపోటు కాదా? అని ప్రశ్నించారు.
సంపద సృష్టిస్తానని, పేదల బతుకుల్లో వెలుగులు తీసుకువస్తానంటూ మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు పీ-4 అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టారని, పేదరికంను నిర్మూలించే బాధ్యత నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలొ హామీలను అమలు చేస్తానంటూ అబద్దాలు చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు కుదరదంటూ అడ్డంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications