ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతో 40 మంది బలి: చంద్రబాబుపై జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. చంద్రన్న కానుక పేరుతో కూపన్లు ఇచ్చి పేదలను భారీగా ఒకేచోటకు తరలించారన్నారు మంత్రి చెప్పారు.

చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట ముంచుతారన్న జోగి
కిట్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారని.. టీడీపీ నేతలు ఎన్నికూపన్లు ఇచ్చారు. ఎంతమందికి పంచారో చెప్పాలని జోగి రమేష్ ప్రశ్నించారు. సంక్రాంతి పేరు చెప్పి నూతన సంవత్సరంలో పేదల ప్రాణాలు బలితీసుకున్నారని ఆయన మండిపడ్డారు. పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు చులకన అని.. ఆయనను నమ్ముకుంటే నట్టేట ముంచుతారని జోగి రమేష్ విమర్శించారు.

కిట్లపై చంద్రబాబు ఫొటోలెందుకు?: జోగి రమేష్
ఉయ్యూరు ఫౌండేషన్ ద్వారా కిట్లు పంపిణీ చేయాలని చంద్రబాబు చెప్పారని.. ప్రజలు ప్రాణాలు పోయినా ఆయన మాత్రం హైదరాబాద్ వెళ్లిపోయారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఈ ఘటనతో సంబంధం లేకపోతే ఈ కిట్లపై చంద్రబాబు ఫొటోలు ఎందుకు వేశారని మంత్రి జోగి రమేష్ నిలదీశారు. సంబంధం లేదంటూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోసం చంద్రబాబు దిగజారిపోయారని మంత్రి విమర్శించారు.

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీతో 40 మందిని బలితీసుకున్నారన్న జోగి
చంద్రబాబును, ఆయన పార్టీని నమ్ముకుంటే ఎన్నారైలు నట్టేట మునుగుతారని మంత్రి హెచ్చరించారు. ఎన్నారైలు.. చంద్రబాబు చెప్పినట్లు వినవద్దని సూచించారు. అమెరికా నుంచి వచ్చి ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్టయ్యారని చెప్పారు. గోదావరి పుష్కరాలలో 29 మందిని బలితీసుకున్నారని.. కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురిని బలి తీసుకున్నారని చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ధ్వజమెత్తారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ.. 40 మందిని బలి తీసుకున్నారని విమర్శించారు. కాగా, గుంటూరు ఘటనపై అధికార పార్టీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతుండగా.. టీడీపీ నేతలు మాత్రం తమపై కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వదని వైసీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబు, టీడీపీ నిర్లక్ష్యంగా కారణంగానే 11 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications