చింతమనేని ప్రభాకర్పై మరో కేసు, ఇప్పుడు జర్నలిస్టుల వంతు
పశ్చిమ గోదావరి:ఏలూరు విజిలెన్స్ కార్యాలయం వద్ద విధి నిర్వహణలో ఉన్న వీడియో జర్నలిస్టులను అకారణంగా అసభ్య పదజాలంతో దూషించినందుకు గాను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై విలేకరులు ఏలూరు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు అనంతరం అడిషనల్ ఎస్పీ ఈశ్వరరావుని కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు. రెండు రోజుల క్రితం అక్రమంగా ఇసుక తవ్వుతున్నారన్న కారణంగా చింతమనేని అనుచరుల వాహనాలను విజిలెన్స్ అధికారులు సంఘటనాస్థలంలో సీజ్ చేసిన క్రమంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
అయితే తన అనుచరుల వాహనాలను సీజ్ చేసిన విషయం తెలిసి చింతమనేని, ఆయన అనుచరులు సుమారు 100 మంది సంఘటనాస్థలానికి చేరుకుని అధికారుల నుంచి బలవంతంగా సీజ్ చేసిన వాహనాలను తీసుకుపోయారు. ఈ విషయం తెలిసి వార్తను కవర్ చేసేందుకు విజిలెన్స్ ఆఫీసు వద్దకు వెళ్లిన వీడియో జర్నలిస్టులను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని అంటున్నారు.
సీజ్ చేసిన వాహనాలను విడిపించుకొని వెళ్లిపోవడంతో పాటు తమపై దౌర్జన్యానికి పాల్పడినందుకు గాను విజిలెన్స్ అధికారులు ఇప్పటికే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఫిర్యాదు చేయగా తాజాగా జర్నలిస్టులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చింతమనేని జర్నలిస్టులను దూషించిన ఘటన తాలూకూ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇటీవలికాలంలో వరుస వివాదాల్లో చిక్కుకొంటున్న టిడిపి దెందులూరు ఎమ్మెల్యేపై ఒకే ఘటనకు సంబంధించి అటు అధికారులు...ఇటు జర్నలిస్టులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎలా స్పందిస్తారనేది...ఏం చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.