ప్రత్యేక హోదా చెల్లని చెక్కు: కాంగ్రెసును తప్పు పట్టిన జెపి
మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం చెల్లని చెక్కులాంటిదని లోక్సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ అన్నారు. రాష్ట్రంలో ఆయన చేపట్టిన సురాజ్యయాత్ర మంగళవారం కృష్ణా జిల్లాలో ముగిసింది.
మచిలీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సురాజ్య యాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేశామన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా కోసం తాను మొదట గొంతెత్తానని, కనీసం వెనుకబాటు జిల్లాలకైనా హోదా వర్తింపజేస్తే బాగుండేదని ఆయన అన్నారు. హోదా విషయంలో కాంగ్రెస్ నాటకాలాడిందని విమర్సించారు.

పోలవరం పనులు వేగంగా జరిగితే 2019 నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని, ఏడాదిగా పనుల్లో వేగం పుంజుకుందని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం లోపించిందని, పరస్పర అవగాహనతో పనులు చేపట్టాల్సి ఉందని ఆయన అన్నారు.
సురాజ్య యాయత్ర అనుభవాలతో దేశ ప్రయోజనాల కోసం త్వరలో పుస్తకం రాస్తానని చెప్పారు. బుధవారం విజయవాడలో లోక్సత్తా భవిష్యత్ కార్యాచరణపై సదస్సు నిర్వహిస్తామన్నారు. ఈనెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమై సురాజ్య యాత్ర అంశాలన్నిటినీ విశదీకరిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications