జేపీకి సీఎం జగన్ పిలుపు వెనుక, లెక్క కుదిరిందా - సీటు సిద్దం..!?
ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏ చిన్న అంశాన్ని వదులుకొనేందుకు సిద్దంగా లేరు. ఎన్టీఆర్ తో నాటి కాలంలో సన్నిహిత సంబంధాలు ఉన్న వారికి ప్రత్యేకంగా గుర్తింపు ఇస్తున్నారు. అందులో భాగంగా తాజాగా లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ కు సీఎం జగన్ అందరి సమక్షంలో ప్రత్యేకంగా గౌరవం ఇచ్చారు. ఇప్పుడు ఈ పరిణమం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి.
సీఎం జగన్ తో జేపీ మంతనాలు: లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న వ్యక్తి. ఐఏఎస్ అధికారిగా, లోక్ సత్తా అధినేతగా రాష్ట్ర ప్రజలకు సుపరిచయం. 2009 ఎన్నికల్లో కుకట్ పల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత 2014 లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసారు.

తరువాత రాజకీయంగా క్రియాశీలకంగా లేకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో సమకాలీన అంశాలు... ప్రభుత్వ నిర్ణయాల పైన స్పందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఓఆర్ఆర్ లో మెట్రో విస్తరణ పైన తీసుకున్న నిర్ణయం పై జేపీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ సమయంలోనే ఏపీలో జేపీ కేంద్రంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
రాజకీయంగా కొత్త చర్చ: లోక్ సత్తా అధినేత జేపీ తాజాగా విజయవాడలో ఒక కార్యక్రమంలో సీఎం జగన్ తో కలిసి వేదిక పంచుకున్నారు. ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలకు హాజరైన సీఎం జగన్ ప్రముఖుల్లో ఆశీనులైన జేపీని తన వద్దకు తీసుకురావాల్సిందిగా మంత్రి జోగి రమేష్ కు సూచించారు. జేపీ వేదికపైకి రాగానే సీఎం జగన్ లేచి నిలబది కరచాలనం చేసారు. తన పక్కన సీట్లోనే కూర్చోబెట్టుకొని మాట్లాడారు.
ఇద్దరూ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. జేపీ చెబుతుండటం..సీఎం నవ్వుతూ వినటం ఆసక్తి కరంగా మారింది. కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి వెళ్లే సమయంలోనూ జేపీ వద్దకు వెళ్లి సీఎం మరోసారి సంభాషించారు. సీఎం జగన్ నిర్ణయాలను జేపీ పలు సందర్భాల్లో ప్రశంసించారు. మరి కొన్ని సందర్భాల్లో మార్పులు అవసరమంటూ సూచనలు చేసారు.

జేపీ అంగీకరిస్తారా: సీఎం జగన్ కు మద్దతుగా పలువురు ఐఏఎస్ లు ఎన్నికల వేల ముందుకు వస్తున్నారు. జేపీ గతంలో ఎన్టీఆర్ వద్ద పని చేసారు. చంద్రబాబుతో సహా, నందమూరి కుటుంబ సభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో జేపీ వైసీపీ నుంచి పోటీ చేస్తారా అనే చర్చ మొదలైంది.
జేపీ ముందుకు వస్తే వైసీపీ నుంచి విజయవాడ లేదా గుంటూరు నుంచి ఎంపీగా బరిలోకి దింపేందుకు సిద్దమని వైసీపీకి మద్దతుగా నిలవటం ..లేదా పార్టీలో చేరటం పైనే నిర్ణయం ఆధారపడి ఉందని చెబుతున్నారు. జేపీ నిజంగా వైసీపీలో చేరి పోటీ చేయకపోయినా..జగన్ కు మద్దతుగా నిలిస్తే టీడీపీ - జనసేన కు షాకింగ్ పరిణామంగానే మారుతుంది. దీంతో, ఇప్పుడు జేపీ తన రాజకీయ ఆలోచన పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.












Click it and Unblock the Notifications